హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న ఫుల్ టైం గెస్ట్ లెక్చరర్లను సర్కారు తొలగించింది. నాలుగైదేండ్లుగా పనిచేస్తున్న తమను అకడమిక్ ఇయర్ మధ్యలో తీసేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వర్క్లోడ్ లేదనే సాకుతో తొలగిస్తున్నట్టు నవంబర్ 25న అధికారులు జీఓ ఇచ్చారని, మంత్రులను, అధికారులను కలిసినా తమకేం తెలియదని దాటేస్తున్నారని వాపోతున్నారు. ఫ్యాకల్టీని తగ్గించడంతో స్టూడెంట్స్ స్టడీపై ఎఫెక్ట్ పడనుందని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
నాలుగేండ్లుగా ఉద్యోగం
కేజీ టు పీజీలో భాగంగా 2017లో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అవసరం మేరకు ఫుల్ టైం గెస్ట్ ఫ్యాకల్టీని ఉపయోగించుకుంటున్నారు. కరోనా టైంలో కూడా స్టూడెంట్స్కు ఆన్లైన్ క్లాస్లు చెప్పించారు. తీరా కాలేజీలు ప్రారంభమయ్యాక అవసరం లేదంటూ వీళ్లను తొలగించడంతో సుమారు 70 ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి.
తక్కువ జీతాలకే పనిచేస్తున్నా..
జనరల్ డిగ్రీ కాలేజీలతో పోలిస్తే గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు డబుల్ వర్క్ ఉంటుంది. డే టైం క్లాస్తోపాటు హాస్టళ్లలో కూడా పనిచేయాలి. జనరల్ డిగ్రీ కాలేజీల్లో నెలకు రూ.54 వేల జీతం ఉండగా గురుకులాల డిగ్రీ కాలేజీల్లో చేస్తున్న వాళ్లకు మాత్రం రూ.25 వేలే ఇస్తున్నారు. అయినా నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు.