ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల క్రమంలో ఆప్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఛట్ పూజలపై నిషేధం విధించింది. దీనికి సంబంధించి ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, మైదానాలు, దేవాలయాలు, ఘాట్లలో ఛట్ పూజ కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది.
ఢిల్లీ ప్రజలంతా ఇంట్లోనే ఉండి పూజలు చేసుకోవాలని DDMA విజ్ఞప్తి చేసింది. ఉత్సవాల సందర్భంగా మేళాల నిర్వహణ, ఫుడ్ స్టాల్స్, ర్యాలీలు, ఊరేగింపులకు కూడా అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం దీపావళి సందర్భంగా పటాకుల అమ్మకాలు, నిల్వ చేయడం, కాల్చడంపై నిషేధం విధించింది.