
న్యూఢిల్లీ: బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ పేటెంట్ హక్కుల ఉల్లంఘన కేసులో డానిష్ ఫార్మా కంపెనీ నోవో నోర్డిస్క్కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, వన్సోర్స్ స్పెషాలిటీ ఫార్మా సంస్థలు నోవో నోర్డిస్క్ పేటెంట్ హక్కులను ఉల్లంఘించే ఉత్పత్తులను మనదేశంలో విక్రయించడం సాధ్యం కాదు. తమ సెమాగ్లుటైడ్ పేటెంట్ను డాక్టర్ రెడ్డీస్ దాని అనుబంధ సంస్థలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ నోవో నోర్డిస్క్ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది.
ఈ డ్రగ్ టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు, బరువు తగ్గడానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతుంటారు. విచారణ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ తరపు లాయర్లు స్పందిస్తూ తాము 2024 డిసెంబర్లో సెమాగ్లుటైడ్ తయారీకి లైసెన్స్ పొంది, 2025 ఏప్రిల్లో ఉత్పత్తిని ప్రారంభించామని కోర్టుకు తెలిపారు. భారతదేశంలో దీనిని విక్రయించడానికి తమకు లైసెన్స్ లేదని అంగీకరించారు.