న్యూఢిల్లీ: ఐఆర్ సీటీసీ స్కామ్ కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పై జరుగుతున్న దర్యాప్తును నిలిపేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తుపై స్టే విధించలేమని తెలిపింది. ఈ కేసులో స్పందనను తెలియజేయాలని కోరుతూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను జనవరి 14కు వాయిదా వేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్ సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ కాంట్రాక్టులను బిహార్ పాట్నాలో ఉన్న సుజాత హోటల్ ప్రైవేట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చారు.
క్విడ్ ప్రోకో (నీకిది.. నాకిది) విధానంలో ఈ లావాదేవీ జరిగిందని సీబీఐ పేర్కొంది. లాలూ, ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్ తో పాటు మరో 11 మందిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది.
