- అందుకే మీ ముందు హాజరు కాలేను: కేజ్రీవాల్
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రానని న్యాయమూర్తికి లేఖ
- సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించిన ఢిల్లీ మాజీ సీఎం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో నిష్పక్షపాత విచారణ జరుగుతుందని తనకు నమ్మకంలేదని ఢిల్లీ మాజీ సీఎం, ఈ కేసులో ప్రధాన నిందితుడు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అందువల్ల ఈ కేసులో తదుపరి జరగబోయే విచారణకు వ్యక్తిగతంగా గానీ, లాయర్ ద్వారా గానీ హాజరు కానని ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మకు సోమవారం లేఖకు రాశారు. ‘హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశలేదు. అందుకే జస్టిస్ స్వర్ణకాంత బెంచ్ ముందు హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో మహాత్ముడి సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తాను’ అని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం, అత్యంత వినయంతో తన అంతరాత్మ ప్రభోదం మేరకు బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. కోపంతోనో, అమర్యాదగానో తాను ఈ నిర్ణయం తీసుకోలేదన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. న్యాయ ప్రక్రియలో సాధారణ పౌరులు ఎదుర్కొనే సమస్యలను లేవనెత్తినట్టు పేర్కొన్నారు. ‘న్యాయం జరిగిందని కాదు, ఆ న్యాయం జరిగినట్టు కనిపించాలి’ అనే ప్రాథమిక న్యాయసూత్రాన్ని ఈ బెంచ్ సంతృప్తి పరచలేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ డిసిషన్ కు వచ్చినట్టు తెలిపారు.
మొత్తం 25 పాయింట్లను లేఖలో ప్రస్తావించారు. అఖిల భారతీయ అధివక్త పరిషత్ కార్యక్రమాలకు జస్టిస్ స్వర్ణ కాంత హాజరువుతున్నారని.. ఆ సంస్థకు అధికార ప్రభుత్వంతో లింకులు ఉన్నాయని.. అందుకే ఆ ఎక్సైజ్ కేసులో ఆ జడ్జిని తప్పించాలని కోరుతున్నట్టు గతంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. జడ్జి ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతుంటే.. తనకు న్యాయం జరుగుతుందని తాను ఎలా ఆశిస్తానని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
తాను గాంధేయ సత్యాగ్రహం రీతిలో పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. అలాగే, చట్టం తనకు కల్పించిన హక్కుల ప్రకారం.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని లేఖలో పొందుపరిచారు.

