పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. చున్నీతో ఉరేసుకున్న బావమరదళ్లు

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. చున్నీతో ఉరేసుకున్న బావమరదళ్లు

వరసకు బావ మరదళ్లు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. తరచూ ఇంట్లో తెలియకుండా సరదాగా షికార్లు కొట్టేవాళ్లు. ఓ రోజు ఆ జంట చెట్టపట్టాలేసుకుని తిరగడం పెద్దలు చూశారు. రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోవడంతో తమ ప్రేమ విషయం చెప్పి.. పెళ్లి చేసుకుంటామని కోరారు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వాళ్లిద్దరు విడిపోయి బతకడం కంటే కలిసి చావడం మేలని అనుకున్నట్లున్నారు. అమ్మాయి ఇంట్లోనే ఇద్దరూ కలసి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని బావన ప్రాంతంలో జరిగింది.

బావన ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల కుర్రాడు, టీనేజర్ అయిన తన మరదలు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బీటెక్ పూర్తి చేసిన అతడు రాజస్థాన్‌లోని కోటలో పీజీ ఎంట్రెన్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం అమ్మాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వచ్చాడు. ఆ ఇద్దరూ కలిసి సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీలతో ఉరేసుకుని ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గదిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ గౌరవ్ శర్మ తెలిపారు. తమ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆ నోట్‌లో ఇద్దరూ సంతకాలు పెట్టారు.

గతంలో ఓ సారి ఇంటి నుంచి వెళ్లిపోయి..

వాళ్లిద్దరూ ఓ రోజు బయట తిరుగుతుండగా తాను చూసి, నిలదీయడంతో తాము ప్రేమించుకుంటున్నామని చెప్పారని అమ్మాయి బాబాయి తెలిపాడు. ఈ విషయంలో ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకుంటామని అడిగారని, కానీ రెండు కుటుంబాలూ దీనికి ఒప్పుకోలేదని అన్నాడు. దీంతో గతంలో డిసెంబరు మొదటి వారంలో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. దీనిపై రెండు కుటుంబాలూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే ఇద్దరూ దొరకడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

More News:

స్నైపర్‌తో కాల్చినా సేఫ్: ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ తయారుచేసిన ఆర్మీ మేజర్

CAAపై బీజేపీలో వ్యతిరేక గళం.. పౌరసత్వానికి, మతంతో లింక్ ఏంటీ?