బాలీవుడ్ నటి నోరా ఫతేహీకి ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నోరా ఫతేహీ ప్రమేయం లేదని, క్రైమ్ సిండికేట్ విషయం ఆమెకు తెలియదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి పై అనుమానం రాగానే నోరా ఫతేహీ అన్ని విషయాలను తమతో పంచుకోగా, నోరా ఇచ్చిన అధారాలకు అనుగుణంగా తాము దర్యాప్తు సాగించామని ఢిల్లీ పోలీసుల బృందం తెలిపింది. నోరా ఫతేహిను గురువారం ఢిల్లీ పోలీసులు దాదాపుగా 6 గంటలకు పైగా ప్రశ్నించారు.
ఇదే కేసులో మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆమెను ఆరా తీశారు. సుఖేశ్ చంద్రశేఖర్ ను ఈడీ గతంలోనే అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్యను రూ.215 కోట్లకు దోపిడీ చేసిన కేసును అతడు ఎదుర్కొంటున్నాడు. వారి వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.