ఢిల్లీ హాస్పిటల్స్‌లోని బెడ్లు.. లోకల్స్‌కు మాత్రమే

ఢిల్లీ హాస్పిటల్స్‌లోని బెడ్లు.. లోకల్స్‌కు మాత్రమే
  • స్పష్టం చేసిన కేజ్రీవాల్‌
  • సెంట్రల్‌ పరిధిలోని హాస్పిటల్స్‌ వేరే రాష్ట్రాల వారికి
  •  బోర్డర్లు తెరిస్తున్నందునే ఈ నిర్ణయం

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌హాస్పిటల్స్‌ కేవలం లోకల్స్‌ కోసమే రిజర్వ్‌ చేశామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. హాస్పిటల్స్‌లో బెడ్లు ఖాళీ లేవనే దానిపై గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఢిల్లీ బోర్డర్లు తెరుస్తున్నందున బయటి రాష్ట్రాల వారు వస్తారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ పరిధిలోకి వచ్చే హాస్పిటల్స్‌లో ఇతర రాష్ట్రాల వారు ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చన్నారు. సోమవారం నుంచి ఢిల్లీ బోర్డర్లు తెరుస్తామని అన్నారు. “ ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో ఉన్న 10వేల బెడ్లను కేవలం లోకల్స్‌ కోసమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నాం. కేంద్రం పరిధిలోనివి, స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ కవర్‌‌ చేస్తున్న ప్రైవేట్‌ హాస్పిట్సల్‌ను అందరూ ఉపయోగించుకోవచ్చు. ఐదుగురు సభ్యుల డాక్టర్ల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని కేజ్రీవాల్‌ చెప్పారు. జూన్‌ చివరి నాటికి ఢిల్లీకి 15వేల బెడ్లు అవసరం అవుతాయని, బోర్డర్లు తెరిచిన తర్వాత ప్రస్తుతం ఢిల్లీలో వాడుతున్న 9000 బేడ్లు మూడు రోజుల్లోనే ఫిల్‌ అయిపోతాయని డాక్టర్లు చెప్పారని కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదవడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో 1320 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.