గచ్చిబౌలిలో లారీ కిందపడి డెలివరీ బాయ్ మృతి

గచ్చిబౌలిలో లారీ కిందపడి డెలివరీ బాయ్ మృతి

గచ్చిబౌలి, వెలుగు: ప్రమాదవశాత్తు లారీ కింద పడి ఓ డెలివరీ బాయ్​చనిపోయాడు. ఈ ఘటన రాయదుర్గం పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం రేనిపట్లకు చెందిన ఎరుకుల ఆంజనేయులు(26) ఉపాధి కోసం సిటీకొచ్చి లంగర్​హౌజ్​లో ఉంటున్నాడు. జెప్టోలో డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం డెలివరీ చేసేందుకు గచ్చిబౌలి జంక్షన్​నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆంజనేయులు బైక్​అదుపు తప్పి కిందపడిపోయాడు.

అదే టైంలో వెనుకగా వచ్చిన ఆక్సిజన్​సిలిండర్లు లారీ అతన్ని తొక్కించుకుంటూ వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులును స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బేగంపేటలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించి, కేసు నమోదు చేశారు.