బాధితులకు నష్టపరిహారం అందించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి

 బాధితులకు నష్టపరిహారం అందించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి

మునుగోడు నియోజకవర్గంలో చర్లగూడెం, (శివన్న గూడెం), కిష్టారాయిపల్లి భూ నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం హాజరయ్యారు. ఆయనతో పాటు భూ నిర్వాసిత బాధితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన భూ నిర్వాసితులు తమ గోడును విన్నవించుకున్నారు. ఈ క్రమంలో చావడమా లేదా సాధించడమా అన్న సిద్ధాంతంతో ఎందుకు వెళ్లాలని పీడీఎస్ యూ నేత సురేష్ అన్నారు.  భూ నిర్వాసితులకు పీడీఎస్ యూ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

2013 జీవో ప్రకారం భూ బాధితులకు న్యాయం జరగాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికీ ఉపయోగం లేదు. ఫార్మాసిటీ వల్ల పొల్యూషన్ పెరుగుతుంది. ఆసియాలోని పటాన్ చెరువు ల్యాండ్ కలుషితమైంది. ప్రజలు ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద మనసుతో భూములు ఇస్తున్నారు కానీ ప్రభుత్వం తగినంత నష్ట పరిహారం ఇవ్వడం లేదు.

-నక్క నారాయణ, అడ్వకేట్

ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుంటే ప్రాజెక్టును నిలిపివేయాలి

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ పేరుతో తక్కువ రేటుకు భూమిని లాక్కుంది.  ఎకరాకు నాలుగు లక్షల పదిహేనువేల రూపాయల చొప్పున కట్టించింది. అరెండర్ ప్రాక్టీస్ ప్రకారం 20 లక్షల రూపాయలు హైవే రోడ్డులో పైన 250 గజాల స్థలంలో ఇండ్లు బాధితులకు ప్రభుత్వం నిర్మించాలి. ధర్నా, నిరసన ఆందోళనలు తెలిపితే పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారు. బాధితులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. 2009లో అరండార్ ప్యాకేజ్ ఇచ్చిన దానిలో 150 మంది పేర్లు మిస్ అయ్యాయి.  పోలీసులు అక్రమంగా బాధితులపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం బలవంతంగా భూమిని లాక్కుంటుంది. తెలంగాణ ప్రజలు అమాయకులు అందుకే కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది. కోర్టుల్లో కేసులు నమోదైనా... కోర్టును తప్పు పట్టిస్తూ భూ నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుంటే ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. 

-శేఖర్ గౌడ్, భూ నిర్వాసితుడు

రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసేటప్పుడు, సీఎం కేసీఆర్ మార్కెట్ వ్యాల్యూ కంటే 5 రేట్లు ఎక్కువగా నష్ట పరిహారం కట్టిస్తానని చెప్పారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పారు.  ప్రభుత్వం అందించే పథకాలు చర్లగూడెం గ్రామానికి ఇవ్వడం లేదు. 

-శ్రీనివాసులు, బాధితుడు

రిజర్వాయర్ శంకుస్థాపన సమయంలో చేసిన  హామీలను కేసీఆర్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ వేల పుస్తకాలు అభ్యసించాను అంటాడు... మాలాంటి వాళ్ళను మోసం చేసే పుస్తకం కూడా కేసీఆర్ చదివాడు. కేసీఆర్ ప్రభుత్వం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

-కేశవ్, బాధితుడు

గతంలో ఏ నేతా ఇలాంటి పాలన చేయలేదు. కేసీఆర్ మునుగోడు భూ నిర్వాసితులను హింసిస్తున్నాడు. ఇలాంటి నియంత్రణ అధినేతను ఉరి తీసినా పాపం లేదు. 

-పాండు రావు, బాధితుడు

జహీరాబాద్ నిమ్స్ ల్యాండ్ స్థాపనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కు అడ్డుకున్నాం. నిమ్స్ భూమిపైన సుప్రీంకోర్టులో కేసు నమోదు చేశాము. 17 గ్రామాల ప్రజలు దీక్షలు, ఆందోళన చేపడుతున్నారు.

-రాఘవరెడ్డి, జహీరాబాద్ నిమ్స్ బాధితుడు