హైదరాబాద్, వెలుగు: అభివృద్ధిలో ఎంతో కీలకమైన భవన నిర్మాణ కార్మికుల సమస్యలను టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని, వెంటనే వాళ్ల డిమాండ్లను నెరవేర్చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తన ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ కమిటీ కలిసి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు కన్స్ట్రక్షన్ టైంలో చనిపోతే వారికి ఇచ్చే ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గాయపడితే రూ.5లక్షల బీమా వర్తించేలా చేయడంతో పాటు కార్మికుడు కోలుకునే దాకా నెలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలన్నారు. కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్కూల్స్లో 5శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని కోరారు. విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్షిప్లు అందజేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనతో కలిపించి సమస్యలు పరిష్కరించేందుకు మరింత కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.
తుంగతుర్తి టీఆర్ఎస్ నుంచి చేరికలు
తుంగతుర్తి నియోజక వర్గంలోని నూతనకల్, తాళ్ల సింగారం, ఎడవెల్లి, మిరియాల గ్రామాల నుంచి 50 మంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. రేవంత్ ఇంటి వద్ద ఆయన సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు కాలం దగ్గర పడిందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
గాంధీభవన్లో బతుకమ్మ వేడుకలు
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్ నేతృత్వంలో గాంధీభవన్లో బుధవారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే సీతక్క చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.