కరీంనగర్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాల్సిన ఉద్యోగులు తమకు ఉన్న పలుకుబడి.. అధికారుల అండతో జిల్లా కేంద్రాలు.. దానికి దగ్గరగా ఉన్న మండలాల్లో పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారు. ప్రమోషన్ల కోసం ఏండ్లకు ఏండ్లు హయ్యర్ స్టడీస్కు వెళ్తున్నారు. దీంతో ఫీల్డ్ లెవల్లో ఆశించిన వైద్య సేవలు అందడం లేదు. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులే ఈ డిప్యూటేషన్ల వ్యవహారం నడిపిస్తూ వైద్య, ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కరీంనగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిన ఆఫీసర్లు, ఉద్యోగులు వివిధ అవసరాల పేరిట తమకున్న పరిచయాలతో డిప్యూటేషన్లు వేయించుకుంటున్నారు. ఇలా చాలా మంది తమకు ఇచ్చిన చోట కాకుండా.. నచ్చిన చోట పోస్టింగులు తీసుకుంటున్నారు. అడపాదడపా డ్యూటీలకు వెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టర్ వచ్చిన 3 నెలలకే హుజూరాబాద్ సీహెచ్సీకి డిప్యూటేషన్ వేయించుకున్నారు. మళ్లీ అక్కడి నుంచి మూడు నెలలకు కరీంనగర్కు డిప్యూటేషన్పై వచ్చారు. చెల్పూర్ పీహెచ్సీ కందుగుల సెక్టార్ మహిళా హెల్త్ సూపర్ వైజర్ కరీంనగర్లోని యూపీహెచ్సీ విద్యానగర్కు వర్క్ ఆర్డర్పై వెళ్లారు.
ఇదే డివిజన్లో మరో ముగ్గురు ఏఎన్ఎమ్లు జీఎన్ఎం ట్రైనింగ్ కోసం వెళ్లారు. ఓ ఆరోగ్య విస్తరణ అధికారి వర్క్ ఆర్డర్పై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వెళ్లారు. ఇటీవల కొత్తగా ఉద్యోగంలో చేరిన స్టాఫ్ నర్స్ ఉన్నత శిక్షణ కోసం వెళ్లారు. జీతాలు చేసే సీనియర్ అసిస్టెంట్ మూడేళ్లు ఫారిన్ సర్వీస్లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి వెళ్లేందుకు డీహెచ్ ఆఫీస్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆయన రేపో మాపో రిలీవ్ కానున్నారు. ఓ వైద్యాధికారి, డ్రాయింగ్ ఆఫీసర్ పీజీ కోసం వెళ్లనున్నట్లు తెలిసింది.
అంతర్గత ఒప్పందాలతో..
చిగురుమామిడిలో పని చేసే ఓ డాక్టర్ తనకున్న పలుకుబడితో గంగాధరకు డిప్యూటేషన్ వేయించుకున్నారు. దీంతో అక్కడ ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి తిమ్మాపూర్ పీహెచ్సీ డాక్టర్ను చిగురుమామిడికి డిప్యూటేషన్పై పంపించారు. తమకున్న అవసరాలు.. ఒకరికొకరు ఇంటర్నల్గా చేసుకున్న ఒప్పందాలతో జమ్మికుంట మండలం వావిలాల నుంచి సైదాపూర్కు, సైదాపూర్ నుంచి వావిలాలకు, హుజూరాబాద్ మండలం చల్లూరు నుంచి ఇల్లందకుంటకు డిప్యూటేషన్లు వేయించుకున్నారు. హుజూరాబాద్ మండలం చెల్పుర్ పీహెచ్సీ పరిధిలోని శాలపల్లి ఇందిరానగర్ వెల్ నెస్ సెంట ర్ (పల్లె దవాఖానా)కు వైద్యాధికారిగా వచ్చిన మహి ళా డాక్టర్ జాయిన్ అయిన రోజే కరీంనగర్కు డిప్యూ టేషన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇక కొన్ని పీహెచ్సీల్లో 20 ఏళ్లకు పైగా ఒకే పరిధిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బదిలీలకు ఇష్టపడడం లేదు. ఒక వేళ చేసినా ఆ చుట్టూ పక్కలున్న పీహెచ్సీ పరిధిలోని పక్క కేంద్రానికే బదిలీ చేయించుకుంటున్నారు.
సరిగా అందని సేవలు
వైద్యాధికారులు, ఆఫీసర్లు డిప్యూటేషన్లపై వెళ్తుండడంతో పేషెంట్లకు సేవలు సరిగా అందడం లేదు. పట్టించుకునే వారు లేక కిందిస్థాయి సిబ్బంది పనితీరులో తేడా కనిపిస్తోంది. దీంతో పేషెంట్లకు హాస్పిటళ్లపై నమ్మకం తగ్గి ప్రైవేట్ వైపు చూస్తున్నారు. పాలనాపరమైన ఇబ్బందులు సైతం తలెత్తుతున్నాయి.
కింది స్థాయి సిబ్బందిపై పని ఒత్తిడి
జిల్లాలో ఈ డిప్యూటేషన్లు కారణంగా అక్కడున్న కిందిస్థాయి సిబ్బందిపై అదనంగా భారం పడుతోంది. ఉన్న స్టాఫ్కే అదనంగా పని చెప్తున్నారు. పీహెచ్సీలలో డ్రాయింగ్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో ఫీల్డ్ లెవల్ ఏఎన్ఎంలకు సెలవులు కావాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎఫ్టీఏ బిల్లులు.. ఏడాదికి ఒకసారి ఇచ్చే ఇంక్రిమెంట్.. సబ్ సెంటర్ అలవెన్స్, సంతకాలు, హంటెడ్ ఫండ్ , శానిటేషన్ నిధులు తీసుకోవాలంటే ఆఫీసర్ల సంతకాలు అవసరం. వీరు అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎంలు ఇబ్బంది పడుతున్నారు. పీహెచ్సీల్లో నిఘా వ్యవస్థ కొరవడడంతో సిబ్బంది సొంత పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షించాల్సిన డిప్యూటీ ఆఫీసర్లు సైతం వారిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కాగితాల్లో రికార్డులు చూపుతున్నారు తప్ప.. ఎక్కడా పర్యటనలు ఉండటం లేదు. కొందరు ఆఫీసర్లు జిల్లా కేంద్రంలోని ఆఫీసుల్లోనే 20 ఏళ్లుగా పాతుకు పోయారు. కొత్త వాళ్లను రానివ్వకుండా డిప్యూటేషన్ల దందాను వీరే చూస్తున్నారనేఆరోపణలున్నాయి. పట్టించుకోవాల్సిన జిల్లా ఉన్నతాధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే వైద్య, ఆరోగ్య శాఖలో ఈ డిప్యూటేషన్ల వ్యవహారాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.