
- సీసీటీవీ ఫుటేజీ సాయంతో చెట్ల పొదల్లో ఆచూకీ గుర్తింపు
మథుర: ఆలయ దర్శనానికి వెళ్లిన ఓ ఫ్యామిలీకి అనూహ్య సంఘటన ఎదురైంది. దొంగల భయంతో మెడలోని నగలు తీసి బ్యాగులో దాచిపెడితే.. ఆలయ ప్రాంగణంలోని ఓ కోతి ఆ బ్యాగును లాక్కెళ్లింది. కుటుంబ సభ్యులు వెనక పరుగులు పెట్టినా కోతి ఆగలేదు, బ్యాగు దొరకలేదు. ఆ బ్యాగులోని నగల విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని బాధిత ఫ్యామిలీ వాపోయింది. ఉత్తరప్రదేశ్లోని బృందావన్ లో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీగఢ్కు చెందిన అభిషేక్ అగర్వాల్ ఇటీవల కుటుంబంతో సహా బృందావన్ లోని థాకూర్ బంకే బిహారీ ఆలయాన్ని సందర్శించారు. దర్శనానికి వెళ్లే ముందు అభిషేక్ భార్య తన నగలను తీసి హ్యాండ్ బ్యాగులో దాచింది.
దొంగల భయంతో ఆమె ఈ పనిచేసింది. తిరిగి వస్తుండగా ఓ కోతి ఈ బ్యాగును లాక్కుని పారిపోయింది. అభిషేక్ తో పాటు అక్కడున్న మిగతా భక్తులు వెంటపడ్డా కోతి దొరకలేదు. ఎంత వెతికినా బ్యాగు దొరకకపోవడంతో అభిషేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించిన పోలీసులు.. కోతి చెట్ల పొదల్లో పడేసిన బ్యాగును గుర్తించి అభిషేక్ కు అప్పగించారు.