
- కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన వ్యాఖ్యలే నిదర్శనం: ఆది శ్రీనివాస్
- బీజేపీ ఎంపీ అయినా ఈటల మనసంతా బీఆర్ఎస్ లోనే
- దొంగలకు సద్దులు మోసేలా ఆయన వ్యాఖ్యలు
- కిషన్రెడ్డి, బండి సంజయ్ ఏం సమాధానం చెప్తరని నిలదీత
హైదరాబాద్ ,వెలుగు: కాళేశ్వరం కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మనసు ఇంకా బీఆర్ ఎస్ లోనే ఉన్నట్లు అర్థమవుతున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. దొంగలకు సద్దులు మోసేలా ఈటల మాట్లాడిన తీరు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘పాత బాస్ కేసీఆర్ రుణం తీర్చుకోవటానికి , ఆయన్ను కాపాడే విధంగా కమిషన్ ముందు తనకేం తెలియదని ఈటల మాట్లాడారు. కేసీఆర్ ను బయట పడేసేందుకు ఈటల శతవిధాలా ప్రయత్నాలు చేశారు.
కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందని కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎన్నో సార్లు మాట్లాడారు. వాటికి ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి”అని డిమాండ్ చేశారు. ఆది శ్రీనివాస్ శనివారం సీఎల్పీలో మీడియా పాయింట్ లో మాట్లాడారు. ‘‘ఈటల రాజేందర్ బీజేపీ అగ్ర నాయకులకు మద్దతుగా మాట్లాడుతారా? బీఆర్ ఎస్కు మద్దతుగా మాట్లాడుతారా చెప్పాలి. ఈటల వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి.
కేసీఆర్ ను కాపాడటానికి ఈటల ప్రయత్నిస్తే.. బీజేపీ, బీఆర్ ఎస్ ఒకటేనని స్పష్టమవుతుంది. కమిషన్ ముందు వాస్తవాలు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు”అని నిలదీశారు. అవగాహన ఒప్పందంలో భాగంగానే కల్వకుంట్ల కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుందని ఈటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల బీఆర్ఎస్లోకి వెళ్తరేమో: మేడిపల్లి సత్యం
ఈటల రాజేందర్ కు పాత బాస్ కేసీఆర్ మీద ప్రేమ పోలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. ‘‘బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని బీఆర్ ఎస్ లో ఈటల జాయిన్ అయ్యేటట్లు ఉంది”అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. శనివారం సీఎల్పీలో సత్యం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు రూ. 8వేల కోట్లు బకాయిలు పెట్టిందని, తమ ప్రభుత్వం రెండు డీఏలు ఇస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటించిందని తెలిపారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తదని 58 ఏండ్ల నుంచి 61ఏండ్లకు రిటైర్మెం ఏజ్ను కేసీఆర్ సర్కార్ పెంచిందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి బీఆర్ఎస్ నేతలు ఫండ్స్ తీసుకు రాలేదని, ఇప్పుడు మాత్రం చిలుక పలుకులు పలుకుతున్నారని ఆయన అన్నారు.