
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో దళిత బంధు పథకానికి ఎంపికై మొదటి ఇన్స్స్టాల్మెంట్ పూర్తి చేసుకున్న వారికి రెండో విడత నిధులు విడుదల చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం ఉదయం మధిర నుంచి ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం అర్హులైన వారి జాబితా రెడీ చేయాలని సూచించారు.
లబ్ధిదారుల సంఖ్య, వారికి అందనున్న నగదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చింతకాని మండలంలో 1,888 మందికి వంద శాతం పూర్తి అయిందని, మిగిలిన యూనిట్లు 1,574 కాగా వీరికి సుమారు రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని కలెక్టర్ డిప్యూటీ సీఎంకు వివరించారు. వీరిలో రూ.లక్ష లోపు విడుదల చేయాల్సిన వారి సంఖ్య 850 కాగా మిగిలిన వారంతా రూ. లక్ష నుంచి రూ.5 లక్షలలోపు ఉన్నట్లు చెప్పారు.
వారం రోజుల్లో తాను చింతకాని మండలంలో పర్యటిస్తానని, ఆ లోగా రూ.30 కోట్ల నిధుల విడుదలకు ఏర్పాటు చేయాలని భట్టి కలెక్టర్ను ఆదేశించారు. చింతకాని మండలంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడత నిధులు పొందేందుకు అర్హులైన వారి లిస్ట్ రెడీ చేయాలని చెప్పారు. గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రపోజల్స్ సిద్ధం చేయాలని సూచించారు.