- రూ. 4.14 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్న వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు
హనుమకొండ, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లిక్కర్ అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ.. అక్రమంగా అమ్ముతున్న వ్యక్తులను వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.4.14 లక్షల విలువైన లిక్కర్ బాటిల్స్ సీజ్ చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలోని శాకరాసికుంటకు చెందిన ఎనగందుల రాజు అలియాస్ జింబాబ్వే రాజు కొంతకాలంగా బెల్ట్షాప్ నడిపిస్తున్నాడు.
స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో సంపూర్ణ మద్యం నిషేధం పాటించాల్సి ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా స్థానిక శివ వైన్స్ యజమానులతో కలిసి బీర్, లిక్కర్ బాటిల్స్ అమ్ముతున్నాడు. సమాచారం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి ఇంట్లో నిల్వ చేసిన రూ.2,86,590 విలువైన లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజును మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.
మరోవైపు సుబేదారిలోని పార్క్లైన్ వైన్స్ కుమ్మక్కై బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వడ్డేపల్లికి చెందిన పెసర రాజ్కుమార్, మిట్టపల్లి రమాదేవి ఇండ్లలో కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. రాజ్కుమార్ ఇంట్లోంచి రూ.77,830 విలువైన, రమాదేవి ఇంట్లో నుంచి రూ.50,130 విలువైన లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యంతో పాటు నిందితులను సుబేదారి పోలీసులకు అప్పగించారు. సీఐలు ఎస్.రాజు, కె.శ్రీధర్, ఎల్.పవన్కుమార్, రవికుమార్, రంజిత్కుమార్, ఎస్సైలు శరత్కుమార్, భానుప్రకాశ్ను వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.
