కార్తీకమాసం తొలి సోమవారం..మార్మోగుతోన్న శైవక్షేత్రాలు

కార్తీకమాసం తొలి సోమవారం..మార్మోగుతోన్న శైవక్షేత్రాలు

కార్తీక మాసం తొలి సోమవారం కావటంతో శివాలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో  ఉన్నారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు చేస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయంలో భక్తులు హోమగుండాలు కాల్చుతున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ఏపీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయం మొత్తం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఆలయంలో భక్తులు కార్తీకదీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.ఆలయానికి భక్తుల తాకిడి పెరగటంతో లఘు దర్శన దర్శనాలు కల్పిస్తున్నారు ఆలయ అధికారులు.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలమ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం శివ నామ స్మరణతో మార్మోగిపోతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. స్పర్శ దర్శనాలను రద్దు చేశారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 

భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవు దినాన, కార్తీక సోమవారాలు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఈవో లవన్న తెలియజేశారు. మరోపక్క వేకువ జామున నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆలయ ముందు భాగంలో ఉన్న గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడవీధిలో ఉసిరిచెట్ల వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో ఎస్.లవన్న తెలిపారు.