ఆధ్యాత్మికం: మన ఆలోచనలే .. మన కర్మ ఫలాన్ని నిర్దేశిస్తాయి..

ఆధ్యాత్మికం: మన ఆలోచనలే .. మన కర్మ ఫలాన్ని నిర్దేశిస్తాయి..

మానవులను.. జీవులను అందరిని దేవుడే సృష్టించాడు కదా..! మనుషుల్లో ఒక్కొక్కరికి ఓక్కో రకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి.. మానవుల ఆలోచనలు ఎలా ఉంటాయి..  ఎలా ఆలోచిస్తారు...ఈ ఆలోచనల గురించి ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఏముంది..  పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.  . 

ఎవరి   ఆలోచనలు ఎలా ఉంటాయో ...  వారు అలానే జీవిస్తారని ఓ  స్వామీజీ తన శిష్యులకు వివరించాడు.  ఒక ఆలోచన నాటితే దాని ఫలాన్ని తప్పక అందుకుంటారు.  ఒక రాజు తన రాజ్యంలో ఏనుగుపై సంచరిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా బజారులోని గంధం చెక్కలు అమ్మే  దుకాణం దగ్గర  ఆ ఏనుగు ఆగిపోయింది. అక్కడ  ఏనుగు ఎందుకు ఆగిందో రాజుకు అర్దం కాలేదు.  కాని ఈ షాపు యజమానిని ఉరిశిక్ష వేయాలనిపిస్తోందని ఆరాజు మంత్రితో అన్నాడు .   రాజు నోటి వెంట ఈ మాటలుల విన్న మంత్రి నిర్గాంత పోయాడు. ..ఎందుకని.  అని రాజును అడిగేలోపే రాజు దిగి నడుచుకుంటూ  ముందుకు వెళ్లిపోయాడు.  

మరుసటి రోజు మంత్రి ఒక సాధారణ పౌరుని వలె ఆ షాపు యజమానిని చూడటానికి దుకాణం దగ్గరికి వెళ్ళాడు. మాటలు కలిపి, 'వ్యాపారం ఎలా ఉంది?' అని అడిగాడు గంధపు చెక్కలు అమ్మే దుకాణం  యజమానిని సాధారణ పౌరునిగా వచ్చిన మంత్రితో  విచారంగా అన్నాడు.  వ్యాపారం సరిగా సాగడం లేదు. ఎవరూ గంధపు చెక్కలు కొనడానికి రావట్లేదు. అందరూ వచ్చి గంధపు చెక్కల నాణ్యత చాలా బాగుంది అని మెచ్చుకుంటున్నారే కాని ఎవరూ కొనడం లేదని బాధను వ్యక్తం చేశాడు. 

మరికొంత మంది గంధం చెక్కల రంగు, వాసన చూసి ఆనందిస్తున్నారు.  కొనేవాళ్లు అసలు ఉండటం లేదని షాపు యజమాని చెప్పాడు. అయితే  అతనికి ఉన్న ఒకే ఒక్క ఆశ ఉండేది...  ఆ దేశపు రాజు చనిపోతే...   అతని దహనసంస్కారాలకి గంధపు చెక్కలు  కొంటారు కదా  అని ..

ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ గంధపు చెక్కల దుకాణాలు లేవు. కాబట్టి రాజు చనిపోయినప్పుడు తప్పనిసరిగా తన వద్దకే వచ్చి గంధపు చెక్కలు కొంటారు అని ధీమాను వ్యక్తంచేశారు.  అప్పుడు గంధపు చెక్కలను  అమ్మి ధనం సంపాదించవచ్చు అని అనుకున్నాడు .  ఇది విన్నాక మంత్రికి...  రాజు అతని దుకాణం ముందు ఆగి ఇతనికి  ఎందుకు ఉరిశిక్ష వేయాలని ఎందుకు అనుకున్నాడో అర్థమైంది. 


ఆ దుకాణం యజమాని చెడు ఆలోచన ఆ దుకాణానికి దగ్గరగా వెళుతున్న రాజును తాకి ఉండవచ్చు. దాంతో రాజు కూడా అతనిని చంపాలి అనే దురాలోచన వచ్చి ఉండవచ్చనే విధంగా మంత్రి ఆలోచించాడు. మంత్రి తను ఎవరో చెప్పకుండా, గంధపు చెక్కల యజమాని నుంచి కొన్ని గంధపు చెక్కలను కొన్నాడు. ఆ దుకాణం యజమాని ఎంతో సంతోషించాడు. 

గంధపు చెక్కలను చక్కగా ఒక పొట్లంలో చుట్టి మంత్రికి ఇచ్చాడు. మంత్రి రాజభవనానికి తిరిగి వచ్చి, నేరుగా రాజు సభ నడుపుతున్న సభా మందిరానికి వెళ్ళాడు.  గంధపు చెక్కల దుకాణపు యజమాని గంధపు చెక్కలను తమకు బహుమతిగా ఇచ్చాడు అని మంత్రి  గంధపు చెక్కల పొట్లాన్ని రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆశ్చర్యపోయాడు. 

గంధపుచెక్కల పొట్లాన్ని విప్పినప్పుడు రాజు చాలా ఆనందించాడు ..అందులో నుంచి చక్కటి పరిమళం ఆయన ముక్కుపుటాలను తాకింది. రాజు ఆనందించిన వాడై కొన్ని బంగారు నాణాలను గంధపు చెక్కల యజమానికి బహుమతిగా పంపించాడు. అదే సమయంలో రాజు తన మనస్సులో అతనికి ఉరిశిక్ష వేయాలన్న ఆలోచన వచ్చినందుకు చాలా సిగ్గుపడ్డాడు. అక్కడ రాజు పంపిన బంగారు నాణేలను తీసుకున్న గంధపు చెక్కల దుకాణపు యజమాని కూడా ఆశ్చర్యపోయినాడు! రాజు యొక్క మంచి గుణగణాలను పొగడటం ప్రారంభించాడు, ఎందుకంటే రాజు పంపిన బంగారు నాణాల వల్ల తన పేదరికం నుంచి బయటపడ్డాడు! కొంత సమయం తర్వాత అతను రాజు పట్ల తనకు కలిగిన చెడు ఆలోచనల గురించి పశ్చాత్తాప పడ్డాడు.  

మనం ఒక మనిషి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటే అది మనకు వెనక్కి మంచిని కలిగిస్తుంది. అదే మనం ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉంటే మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో చెడు ప్రభావం తగులుతుంది. చాలామంది  మన మాటలు, మన చేతలు, మన పనులు, ఇవే కర్మ అంటారు.  కాని మన  ఆలోచనలే మన కర్మగా మారతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

Disclaimer:  పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని ఆధ్యాత్మిక పండితుల  సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం.. పలు గ్రంథాల నుంచి సేకరించిన సమాచారాన్ని  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.