
ప్రముఖులైనవారు ఆచరించిన దానినే సామాన్యులు అనుసరిస్తారు అంటాడు. ఇది అన్ని కాలాలకి... అన్ని దేశాలకి .. అందరికి వర్తించే మాట.కర్మబంధం కారణంగా మామూలు మనుషులలాగా పుట్టినవాడు కాదు కృష్ణుడు. ఒక ప్రయోజనం కోసం అవతరించిన పరంధాముడని ఇతిహాస గ్రంథాల ద్వారా తెలుస్తోంది. .
సాధారణంగా మానవులకు వారి స్వభావాలకు తగిన పని నిర్దేశించబడుతుంది. దానిని అనుసరించి ఆచరించటం మనిషి కర్తవ్యం. అది సుఖమైన పద్ధతి. కాని అదేమి చిత్రమో.... చాలామందికి తాము చేయవలసిన పని నచ్చదు. ఎదుటివారిది నచ్చుతుంది. అది అంత తప్పేం కాదు కాని... తమది నచ్చకపోవటం.. దానిని సరిగా నిర్వర్తించలేకపోవటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి.
తన కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉంటే జ్ఞానం లభించటంతో పాటు బంధ విమోచనం కూడా కలుగుతుంది. ఆ విధంగా ప్రవర్తించటం వల్ల సిద్ధి పొందుతారనటానికి జనక మహారాజు వంటి వారెందరో నిదర్శనంగా నిలుస్తారు. వారు తమ కర్తవ్యాలని నిర్వర్తించటమే సాధనగా చేశారు. అది కూడా నిష్కామంగా ఒక్క బాధ్యతని కూడా నిర్లక్ష్యం చేయలేదు. అలాగని దేనితోనూ మమేకం కాలేదు. అంటీ అంటనట్లు నిర్లిప్తంగా చేశారు.
►ALSO READ | VitaminB12: విటమిన్ బి12 లోపిస్తే...మెదడు పనితీరు మందగిస్తుందా?
ఆ విధంగా చేయవలసిన అవసరం ఏముంది? ఎందుకు చెయ్యాలి? దానివల్ల పొందేది ఏముంది? అనే ప్రశ్నలు రావటం సహజం..... రావాలి కూడా.... అర్జునుడికి అటువంటి సందేహం వస్తుందని... జరిగిపోయిన దానికన్నా... కంటి ముందు కనపడేదానిని ఉదాహరణగా చూపిస్తే బాగా అర్థం అవుతుందని తననే ఉదాహరణగా చెపుతాడు కృష్ణుడు . చెప్పేవారు తమని గురించి చెప్పినప్పుడు వినేవారికి మరింతగా హృదయానికి హత్తుకుంటుంది.
ఇక్కడ ఒక గొప్ప మనస్తత్వశాస్త్ర సత్యాన్ని ఆవిష్కరిస్తాడు శ్రీకృష్ణుడు. ప్రముఖులైనవారు ఆచరించిన దానినే సామాన్యులు అనుసరిస్తారు అంటాడు. ఇది అన్నికాలాలకి, అన్నిదేశాలకి వర్తించే మాట. అందుకని, అందరూ ఏవిధంగా ఉండాలని అనుకుంటామో ఆవిధంగా ప్రముఖులైన వారు ఉంటే చాలు. ఎంతో మంది ఆ విధంగానే ఉంటారు. కృష్ణుడు తన కాలంలో ప్రముఖుడు... ఎంతోమందికి ఇష్టుడు.... ఎందరికో ఆదర్శప్రాయుడు...
కృష్ణుడి లాగా ఉండాలని తాపత్రయ పడేవారున్నారనటానికి పౌండ్రక వాసుదేవుడి వంటి వారే పరమోదాహరణం. పైగా కృష్ణుణ్ణి దైవంగా భావించేవారు... గుర్తించినవారు కూడా ఉన్నారు. తన కాలం కాకపోయినా తరువాతి కాలంలోనైనా దైవంగా పూజించేవారు ఉంటారు. ఎవరి మాటోదాకా ఎందుకు? తానిప్పుడు మాట్లాడుతున్న అర్జునుడే ఉన్నాడు. ఏదైనా చెప్పగానే "నాకు చెపుతున్నావు గానీ నీ సంగతి ఏమిటి?" అని అడుగవచ్చు. ఆచరించి చెప్పిన మాటకి విలువ ఉంటుంది, వినాలనిపిస్తుంది. అందుచేత కృష్ణుడు తన విషయమే చెపుతాడు.
తనకి ఏమీ చేయాలనే నిబంధన లేదు. ఎందుకంటే కర్మబంధం కారణంగా మామూలు మనుషులలాగా పుట్టినవాడు కాదు కృష్ణుడు. ఒక ప్రయోజనం కోసం అవతరించిన పరంధాముడు. కనుక కర్మపరిహారం కోసం ఏమీ చేయవలసిన పనిలేదు. అలాగని ఏమీ చెయ్యకుండా ఉన్నట్లయితే మామూలు మానవులు తాము కూడా ఏమీ చెయ్యకుండా ఉండటమే సరైన పద్ధతి అని అనుకునే ప్రమాదం ఉంది.
కర్మశూన్యులు కావటానికి తానే కారణం అవటం జరుగుతుంది. అవతార ప్రయోజనం నిష్ఫలం.
ఈ సందర్భంలో అర్జునుడు గుర్తించవలసిన అంశం ఒకదానిని సున్నితంగా సూచించాడు కృష్ణుడు. కృష్ణుడికి యుద్ధభూమికి రావలసిన అవసరం లేదు.వచ్చి కూడా ఆయుధం పట్టనని ముందే ఒప్పందం చేసుకున్నాడు.
ఎవరు గెలిచినా కృష్ణుడికి ఒరిగేది ఏమీ లేదు. అయినా ఎందుకు చేశాడు? తానే చెయ్యకపోతే ఎవరూ చెయ్యరు. అవసరంలేని తనే యుద్ధభూమికి రాగా, అవసరం ఉన్న అర్జునుడు యుద్ధభూమి నుండి వెళ్లిపోతాననటం ఎంత హాస్యాస్పదం" అని వ్యంగ్యంగా అన్నాడట.
జగదేకవీరుడని ప్రఖ్యాతి పొందిన అర్జునుడే యుద్ధం చెయ్యనంటే అందరూ అదే అంటారు. అప్పుడు ఆ దోషం అర్జునుడిది అవుతుంది. అందుకని తనకోసం కాకపోయినా ఇతరులని నిష్క్రియులుగా చేయకుండా ఉండటానికి యుద్దం చెయ్యవలసినదే. ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞార్థం చేస్తున్నాననే భావనతో యుద్ధమే కాదు.
►ALSO READ | Good Health: షుగర్పేషెంట్లు ఎప్పుడు.. ఎలాంటి ఆహారం.. ఏయే సమయాల్లో తీసుకోవాలో తెలుసుకోండి..!
ఏ పనైనా చేస్తే కర్మ బంధం ఉండదు.ఈ జ్ఞానం లేని వారు ఫలితాన్ని ఆశించి చేస్తారు. వాళ్ళు ఎంతటి శ్రద్ధతో చేస్తారో నువ్వు కూడా అంతటి శ్రద్ధతో చెయ్యమని కృష్ణుడు, అర్జునుణ్ణి ఆదేశించాడు. దాని వల్ల లోకక్షేమం జరుగుతుంది. ఇక్కడ మరొక్క ముఖ్య విషయం ప్రస్తావించాడు కృష్ణుడు. అనేకమైన చికాకులకి కారణం ఇదే. తాను ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని ఆచరిస్తున్నాడు కనుక. అందరూ అదేవిధంగా ఉండాలని ఆశించవద్దు అన్నాడు.
సహజంగా మనుషులకి తాము ఆచరించే దానిని అందరూ పాటించాలని ఉంటుంది. కొన్ని మంచి విషయాలు తాము పాటించకపోయినా ఎదుటివారు పాటించాలని అనుకుంటారు. అటువంటిది తామే పాటిస్తున్న వాటిని అందరూ కూడా పాటించాలనుకోవటం సహజం. కాని, ఎక్కువమంది ప్రతిఫలం లేకుండా చేయటానికి ఇష్టపడరు. దానితో జరగవలసిన పనులకి ఆటంకం కలుగుతుంది.
లోక వ్యవహారానికి భంగం కలగకుండా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించైనా జరుగుతున్న పనులని సాగనియ్యటం మంచిది కదా. వేతనం మీద దృష్టి ఉన్నా, శ్రద్ధగా చేసిన పని విజయవంతం అవుతుంది. కనుక ఏదో విధంగా అందరినీ శ్రద్ధగా పని మీద దృష్టి పెట్టేట్టు చేయాలి. అందుకు ముందు అర్జునుడు తాను ఆచరించవలసి ఉంది.అవసరం లేకపోయినా నిష్క్రియులుగా ఎందుకు ఉండకూడదో చక్కగా వివరించాడు శ్రీకృష్ణుడు.