ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..ధర్మం. అంటారు. ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.
ధర్మం చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ..దానం.. చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా... తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.
గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.
గోదానం : గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది... మంచి వయసులోనున్నది... దూడతో కూడుకున్న ఆవు కొమ్ములకు బంగారం తొడిగి... డెక్కలకు వెండి , కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావిథిగా దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంతుష్టుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు. అలా చేసేందుకు శక్తి లేని ఆవు దూడతో పాటు కొంత ధనాన్ని దానం చేయాలి.
ALSO READ : పాపాలే ఇంపుగా ఉంటాయి..
భూదానం : కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహవతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు ప్రీతిచెంది దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
తిలదానం: తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు ..ఆశీస్సులతో .. దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (బంగారం)దానం : హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత ... సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు ., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
ఆజ్య(నెయ్యి)దానం : ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు ప్రీతి చెంది దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
వస్త్రదానం: శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మానాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.
ధాన్యదానం : జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ(బెల్లం)దానం : రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంతృప్తి చెంది., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత(వెండి)దానం : అగ్నిదేవుని కన్నీటి నుండి ఉద్భవించింది వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంతుష్టలై.. దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.
లవణ(ఉప్పు)దానం: రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెంది.. దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇంకా ఏమేమి దానం చేస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా..!
- బియ్యాన్ని దానం చేస్తే.........పాపాలు తొలగుతాయి
- వెండిని దానం చేస్తే........... మనశ్శాంతి కలుగుతుంది
- బంగారుని దానం చేస్తే.........దోషాలు తొలగుతాయి
- పండ్లను దానంచేస్తే........బుద్ధి,సిద్ధి కలుగుతాయి
- పెరుగును దానం చేస్తే.......ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది
- నెయ్యి దానం చేస్తే......రోగాలు పోతాయి..ఆరోగ్యంగా ఉంటారు
- పాలు దానం చేస్తే......నిద్రలేమి ఉండదు
- తేనెను దానం చేస్తే......సంతానం కలుగుతుంది
- ఉసిరికాయలు దానం చేస్తే....మతిమరుపు తగ్గి ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది
- టెంకాయ దానం చేస్తే......అనుకున్న కార్యం సిద్ధిస్తుంది
- దీపాలు దానం చేస్తే......కంటిచూపు మెరుగుపడుతుంది
- గోదానం చేస్తే......ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి
- భూమిని దానం చేస్తే......బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది...ఈశ్వరలోక దర్శనం కలుగుతుంది
- వస్త్ర దానం చేస్తే......ఆయుషు పెరుగుతుంది
- అన్నదానం చేస్తే......పేదరికం తొలగిపోయి.. .ధనవృద్ధి కలుగుతుంది
