తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఇవాళ(బుధవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. నిన్న ఖమ్మం పర్యటనలో ఉన్న డీహెచ్ శ్రీనివాసరావు హైకోర్టులో విచారణకు హాజరు కాలేకపోయారు. ఇవాళ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. మూడోదశ కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. దీనికి వివరణిచ్చారు శ్రీనివాసరావు.
థర్డ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర సీఎస్ ఆదేశాలతో ముందస్తు ప్రణాళికను రెడీ చేశామన్నారు. సెకండ్ వేవ్ లో 55444 బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రాష్ట్రం లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్స్ కు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు.
ఆస్పత్రులు వసూలు చేసిన అధిక ఛార్జీలు బాధితులకు తిరిగి చెల్లించాయా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు 115 కేసులు వచ్చాయంటున్నారు ఇందులో ఎంత మందికి రీ ఫండ్ ఇచ్చారని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితులకు ఛార్జీలు తిరిగి ఇప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని డీహెచ్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. నిన్న ఒక ఆస్పత్రి 17 లక్షలు బిల్ వేసిందని..తాము చర్యలు తీసుకుని 10 లక్షలు పేషెంట్ కుటుంబ సభ్యులకు రిటర్న్ ఇప్పించామన్నారు. అంతేకాదు..ఇందులో 113 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామని..20 హాస్పిటల్స్ లైసెన్స్ రద్దు చేసామని చెప్పారు.
కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీహెచ్ శ్రీనివాసరావు హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 800 కేసులు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని..ఫంగస్ నియంత్రణ కు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. బ్లాక్ ఫంగస్ మందుల ధర 3 వేల రూపాయల వరకు ఉందని కోర్టుకు తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ ఉంటేనే ప్రైవేట్ ఆస్పత్రులకు లైసెన్స్ లు ఇస్తున్నట్లు తెలిపారు డీహెచ్ శ్రీనివాసరావు.