
మాస్ మహారాజ ‘రవితేజ’ నటించిన ‘ధమాకా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు డైరెక్టర్ త్రినాథ్ రావు స్పందించారు. ఓ సామాజిక వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంపై క్షమాపణ కోరారు. గురువారం చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ త్రినాథ్ రావు.. ఆ పదం తెలిసి వాడింది కాదన్నారు. తాను కూడా బీసీననే... ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తనపై కోపాన్ని సినిమాపై చూపెట్టవద్దని, ‘ధమాకా’ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. చిత్ర బృందం, తన తరపున మరోసారి క్షమాపణలు చెప్పారు.
‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సగర ఉప్పర సంఘం డిమాండ్ చేసింది. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ ఫిలిం చాంబర్ వద్ద నాయకులు బుధవారం ఆందోళన నిర్వహించారు. వారి దిష్టి బొమ్మలను దహనం చేశారు.