శ్రీరామ.. నీ నామమెంత రుచిరా అని పాడుకోడమే కాదు. శ్రీరామ నవమికి పసందైన వంటకాలు చేసుకుని.. వాటిని ఆరగిస్తూ నవమిని మరింత సంతోషంగా జరుపుకోవచ్చు ఇవన్నీ తెలిసిన వంటకాలే అయినా...మరోసారి మీకోసం...
పానకం తయారీకి కావాల్సినవి
- బెల్లం: ఒక కప్పు
- నీళ్లు : లీటర్
- మిరియాల పొడి: ఒక టీ స్పూన్
- అల్లంపొడి : ఒక టీ స్పూన్
- యాలకులు : ఒక టీ స్పూన్
పానకం తయారీ విధానం
లీటర్ నీళ్లలో తురిమిన బెల్లం కరిగే వరకు కలపాలి. అందులో యాలకుల పొడి, మిరియాలు పొడి, అల్లం పొడి వేసి బాగా కలిపితే పానకం రెడీ
వడపప్పు తయారీకి కావలసినవి
- పెసరపప్పు: అర కప్పు
- బెల్లం: కొంచెం
వడపప్పు తయారీ విధానం
పెసరపప్పు గంట నానబెట్టాలి. నీళ్లు వడకట్టి పెనరపప్పుని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం బెల్లం కలుపుకుంటే వడపప్పు సిద్ధం.
చలిమిడి తయారీకి కావాల్సినవి
- బియ్యం పిండి : ఒక కప్పు
- చక్కెర లేదా బెల్లం తురుము: ముప్పావు కప్పు
- తురుమిన కొబ్బరి తురుము: పావు కప్పు
- చక్కెర పొడి: అర టేబుల్ స్పూన్
- నెయ్యి: ఒక టేబుల్ స్పూన్
చలిమిడి తయారీ విధానం
ముందుగా నెయ్యి వేడి చేసి చల్లార్చాలి. అందులో చక్కెర లేదా తురిమిన బెల్లం, కొబ్బరి వేసి బాగా కలపాలి. తర్వాత బియ్యప్పిండి వేసి మరోసారి బాగా కలపాలి. పిండి దగ్గరకు అయ్యాక గిన్నెలో తీసుకోవాలి.
చక్కెర పొంగలి తయారీకి కావలసినవి
- బియ్యం: ఒక కప్పు
- పెసరపప్పు: అరకప్పు
- పాలు ; ఒక కప్పు
- చక్కెర: అర కప్పు
- జీడిపప్పు : ఎనిమిది
- కిస్మిన్: ఎనిమిది
- కొబ్బరి ముక్కలు:అర కప్పు
- యాలకుల పొడి: ఒక టేబుల్ స్పూన్
- నెయ్యి : ఐదు టేబుల్ స్పూన్
చక్కెర పొంగలి తయారీ విధానం
పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేగించాలి. ఇందులో శుభ్రంగా కడిగిన బియ్యంతో పాటు నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తర్వాత పాలు, చక్కెర వేసి మరికొద్ది సేపు ఉడికించి యాలకుల పొడి కలపాలి. మరో పాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కొబ్బరి ముక్కల తరుగు కిస్మిస్ వేగించి, ఉడికించి పొంగలిలో కలపాలి.
పరప్ప వడ తయారీకి కావాల్సినవి
- మినప్పప్పు: ఒక కప్పు
- ఉల్లిపాయ తరుగు : ముప్పావు కప్పు
- అల్లం ముక్క : ఒకటి
- పచ్చిమిర్చి : రెండు
- ఇంగువ: చిటికెడు
- కరివేపాకు : రెండు రెమ్మలు
- కొత్తిమీర: ఒక కప్పు
- నూనె వేగించడానికి: సరిపడా
- ఉప్పు: తగినంత
పరుప్ప వడ తయారీ విధానం
మినప్పప్పు బాగా కడిగి రెండు గంటలు నానబెట్టి నీళ్లు వడకట్టాలి. ఇందులో కొద్దిగా పప్పు తీసుకొని ఉప్పు కలిపి కచ్చాపచ్చాగా రుబ్బాలి. మిగిలిన పప్పుని మెత్తగా రుబ్బాలి. ఈ రెండిటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. సన్నని మంట మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి.
ముందుగా చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకుని వడలా చేసి కరకరలాడే వరకు నూనెలో వేగించాలి. పడుప్పు పడలు కొబ్బరి, పల్లీ, టొమాటో చట్నీలతో తింటే రుచిగా ఉంచాయి.
శెనగలు, రవ్వ పులిహోర తయారీకి కావాల్సినవి
- బియ్యం రవ్వ : ఒక కప్పు
- నీళ్లు : రెండు కప్పులు
- ఉడికించిన కాబూలీ శెనగలు: అర కప్పు
- మినప్పప్పు : రెండు టీ స్పూన్లు
- పచ్చి శెనగపప్పు: రెండు టీ స్పూన్లు
- పల్లీలు: రెండు టీ స్పూన్లు
- ఆవాలు: పావు టీ స్పూన్
- ఇంగువ: కొద్దిగా
- పసుపు : చిటికెడు
- నిమ్మరసం : ఒకటి టీ స్పూన్
- ఎండుమిర్చి : రెండు
- పచ్చిమిర్చి: రెండు
- కరివేపాకు: రెండు రెబ్బలు
- ఉప్పు తగినంత
- నూనె: మూడు టీ స్పూన్లు
శెనగలు, రవ్వ పులిహార తయారీ విధానం
రెండు కప్పుల నీటిలో బియ్యం రవ్వ, పసుపు, కొద్దిగా నూనె వేసి పొడిపొడిగా ఉడికించాలి. తర్వాత ఒక పాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్ని శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించిన కాబూలీ శెనగలు వేసి వేగించాలి. మరో గిన్నెలో ఉడికించిన బియ్యం రవ్వ, వేగించిన పోపు మిశ్రమం వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చివరిగా నిమ్మరసం కలుపుకుంటే శెనగలు రవ్వ పులిహోర రెడీ
చింతపండు పులిహోర తయారీకి కావాల్సినవి
- బియ్యం: అర కిలో
- చింతపండు: వంద గ్రాములు
- ఎండుమిర్చి :25
- శెనగపప్పు: రెండు టేబుల్ స్పూను
- మినప్పప్పు, రెండు టేబుల్ స్పూన్లు
- ఆవాలు ఒకటీ స్పూన్
- ఇంగువ ఒకటీస్పూన్
- ఉప్పు: రుచికి సరఫడా
- పసుపు: ఒక టీస్పూన్
- నువ్వుల నూనె : రెండు వందల గ్రాములు
- ధనియాలు ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర: అర టీ స్పూన్
- మెంతులు: అరటీస్పూన్
- పల్లీలు లేదా జీడిపప్పు: యాభై గ్రాములు
- కరివేపాకు : పది రెమ్మలు
చింతపండు తయారీ విధానం
ఉడికించిన అన్నంలో రెండు టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి పక్కన పెట్టాలి. తర్వాత చింతపండులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టి చిక్కని గుజ్జు తీయాలి. చిన్న పాన్ లో మెంతులు వేగించి పొడి చేయాలి.
మరో పాన్ లో నువ్వుల నూనె వేసి పప్పులు, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు వేగించాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
ఇందులో కరివేపాకు, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి. చింతపండు గుజ్జు దగ్గరగా అయిన తర్వాత చల్లార్చాలి. అందులో మెంతిపొడి వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి.
దద్దోజనం తయారీకి కావలసినవి
- బియ్యం: అర కప్పు
- నీళ్లు :ఒకటిన్నర కప్పులు
- పెరుగు: ఒక కప్పు
- పాలు: పావు కప్పు
- పచ్చిమిర్చి: రెండు
- అల్లం: ఒకటిన్నర టీ స్పూన్
- ఆవాలు :ముప్పాపు టీస్పూన్
- పచ్చి శెనగపప్పు :ముప్పావు టీస్పూన్
- మినప్పప్పు: అర టీ స్పూన్
- కరివేపాకు: రెండు రెమ్మలు
- నూనె: రెండు టీ స్పూన్లు
- ఎండుమిర్చి: రెండు
దద్దోజనం తయారీ విధానం
బియ్యం శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్యే వరకు కుక్కర్లో ఉడికించి.. మెత్తగా చేయాలి. అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాయి పోసి చల్లారనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
పాన్లో నూనె వేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినప్పప్పు పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఎండుమిర్చి, ఇంగువ వేగించాలి. ఈ తాలింపు పెరుగన్నంలో వేసి బాగా కలిపి దానిమ్మ గింజలతో అలంకరించాలి.
