హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు మేం పెండింగ్లో పెట్టలేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం (మార్చి 26) అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.627 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు బకాయిలు పెట్టిందని చెప్పారు. అందులో రూ.240 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు.. రూ.360 కోట్లు ప్రైవేట్ ఆస్పత్రులకు బకాయి ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడూ చెల్లిస్తుందని తెలిపారు. ప్రతినెలా ఆరోగ్యశ్రీకి రూ.90 కోట్ల ఖర్చు చేస్తున్నామన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.927 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు.. రూ.1,480 కోట్లు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించామని తెలిపారు. బీఆర్ఎస్ పెట్టిన భారం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ మేం అసలు పేమెంట్స్ ఇవ్వడం లేదన్నట్లు మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
పేదలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో సీఎంఆర్ఎఫ్ నిధులన్నీ గోల్ మాల్ చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎవరీ పీఏలు అక్రమంగా కాజేశారో కూడా తెలుసని.. విచారణ జరుగుతుంది అన్ని బయటకు వస్తాయని హెచ్చరించారు.
