
ధనుష్ , నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్న హీరోయిన్. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. జూన్ 20న పాన్ ఇండియా వైడ్గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సినిమాపై అంచనాలు పెంచగా, మంగళవారం ‘పీ పీ డుమ్ డుమ్’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేశారు. ముంబైలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ ‘ఇది నా మనసుకు దగ్గరైన సినిమా. నాగార్జున గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇందులో పోషించిన బెగ్గర్ క్యారెక్టర్ కోసం ఓ డంప్ యార్డ్లో 7 గంటల పాటు షూటింగ్ చేశాం. అంతసేపు ఉన్నా తనకేం వాసన రాలేదని చెప్పింది రష్మిక. ఆమెకు ఏమైందో నాకు తెలియదు (నవ్వుతూ). ఇక ఈ పాత్ర కోసం పూర్తిగా మా డైరెక్టర్ని ఫాలో అయ్యానంతే. శేఖర్ గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన చొరవతోనే ఇలాంటి క్యారెక్టర్ చేశా. ఈ సినిమా నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. అలాగే ఈ టీమ్తో ఎన్నో మంచి జ్ఞాపకాలు పంచింది’ అని చెప్పాడు.
నాగార్జున మాట్లాడుతూ ‘నాకిది వెరీ స్పెషల్ మూవీ. శేఖర్ గారితో గత 15 ఏళ్లుగా పని చేయాలనుకుంటున్నా. ఈ కథ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పా. తన సెన్సిబిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ధనుష్, రష్మిక లాంటి బ్రిలియంట్ యాక్టర్స్తో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది’ అని అన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుందని రష్మిక చెప్పింది. ఈ మూవీ కోసం తెలుగు నేర్చుకోవడం చాలెంజింగ్గా అనిపించిందని జిమ్ సర్భ్ అన్నాడు.