హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర సర్కారు అవినీతిపై విచారణకు కమిషన్ వేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినట్లు తెలుస్తున్నది. ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్ తెస్తామని, నిజాం షుగర్ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ల ఏర్పాటు, మహిళా రైతు కమిషన్లాంటి కీలక అంశా లనూ చేర్చినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి చేసినప్పటికీ.. హైకమాండ్ ఆదేశాల మేరకు శుక్రవారం కొన్ని కీలక హామీలను అందులో పొందుపరిచినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
నేడు మధ్యాహ్నం హైదరాబాద్కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా.. ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయడంతో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి హెలికాప్టర్లో గద్వాల సభకు వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ సభలో, సాయంత్రం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగే సభలో పాల్గొననున్నారు.
సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్లోని హోటల్ కత్రియాలో బీజేపీ మెనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్ నేతల తో భేటీ కానున్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని, ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని షా ఆ వర్గాన్ని కోరనున్నట్లు తెల్సింది. రాత్రి 8 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి అహ్మదాబాద్ కు వెళ్తారు.