- ప్రాంతీయ ఆకాంక్షలు తీరుస్తుందన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ (సవరణ) బిల్లు– 2023 ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. వరంగల్ జిల్లా ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ రీ–ఆర్గనైజేషన్ యాక్ట్–2014 లో ఇచ్చిన హామీ మేరకు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బిల్లులో ప్రస్తావించారు.
ఈ వర్సిటీకి ‘సమ్మక్క– సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ గా పేరు పెట్టినట్లు తెలిపారు. ట్రైబల్ యూనివర్శిటీని రూ.889.07 కోట్లతో రెండు దశల్లో ఏడేండ్లలో నిర్మించనున్నట్లు వివరించారు. ఈ యూనివర్శిటీ ఏర్పాటు రాబోయే కాలంలో ప్రాంతీయ ఆకాంక్షలను తీర్చగలదని అన్నారు. అలాగే ఉన్నత విద్య నాణ్యతను పెంచుతుందని ప్రస్తావించారు.
తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలను పెంచుతుందని, ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలోని గిరిజన జనాభాకు గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు, సాంకేతికతలో పురోగతిలో బోధన, పరిశోధన సౌకర్యాలను అందించడంతో అధునాతన జ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తుందని బిల్లులో పొందుపరిచారు. మంత్రి ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు.