
గండిపేట్,వెలుగు: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిచెట్టు సర్కిల్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండగా.. ఆటోలు నడపలేక ఫైనాన్స్ కట్టలేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నామని ఆటోడ్రైవర్లు వాపోయారు. తమకు ప్రత్యమ్నాయం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.
లేదంటే ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆటో యూనియన్ నేతలను పోలీసులు అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అంజి, రమేష్, రెడ్డి, రవి, సైదులు, రాజు, రాఘవులు, నర్సింహ్మ, శ్రీను, కళ్యాణ్, వెంకట్చారి తదితరులు ఉన్నారు.
తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి
శంషాబాద్ : శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్ను సోమవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయడంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం వారి కుటుంబాల కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన గిరాకీ లేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రోజుకు రూ. వెయ్యి చొప్పున భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు.