రిటైర్మెంట్ ప్రకటించని MS ధోని.. చెపాక్‌లో భావోద్వేగానికి గురైన ఫ్యాన్స్! 2027లో ‘తలా’ రీఎంట్రీ?

రిటైర్మెంట్ ప్రకటించని MS ధోని.. చెపాక్‌లో భావోద్వేగానికి గురైన ఫ్యాన్స్! 2027లో ‘తలా’ రీఎంట్రీ?

Dhoni Retirement: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. సోమవారం రాత్రి చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత.. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. కానీ, ధోని మరోసారి తన రిటైర్మెంట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా సస్పెన్స్ కొనసాగించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నో రిటైర్మెంట్: 
సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం, ధోని సీఎస్‌కే జట్టు సభ్యులతో కలిసి మైదానంలో కాసేపు తిరిగారు. కిక్కిరిసిపోయిన ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) మొత్తం ‘ధోని.. ధోని..’ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే చివరి హోమ్ మ్యాచ్ కావడంతో.. ‘తలా’ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ, ధోని మౌనంగానే ఉండిపోవడంతో, ఆయన వచ్చే ఏడాది (IPL 2027) కూడా ఆడబోతున్నాడనే కొత్త ఆశలు చిగురించాయి.

గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం: 
గాయం కారణంగా సన్‌రైజర్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగలేదు. అయినప్పటికీ, మ్యాచ్ ముగిశాక ఆయన స్టేడియంలోకి అడుగుపెట్టడమే ఆ రాత్రికి అతి పెద్ద హైలైట్‌గా నిలిచింది. అంతకుముందు, స్టేడియం స్టాండ్స్‌లో ధోని భార్య సాక్షి ధోనితో పాటు ఆయన చిన్ననాటి స్నేహితుడు ‘చిత్తు’ కూడా కనిపించడంతో.. ఇది ధోనికి ఫేర్‌వెల్ (వీడ్కోలు) మ్యాచ్ కాబోతుందనే ప్రచారం ఊపందుకుంది.

►ALSO READ | క్లాసెన్ జర కోపం తగ్గించుకో.. మా సంజు జోలికి వస్తే మంచిగా ఉండదు..

హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు:
మాజీ టీమిండియా స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ.. ఒకవేళ ధోని ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పకపోతే, చెన్నై మైదానంలోనే తన చివరి టీ20 మ్యాచ్ ఆడాలనే తన పాత వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చే ఏడాది (IPL 2027) కూడా బరిలోకి దిగుతాడని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. కానీ తమ ప్రియమైన క్రికెటర్ 'తలా' మళ్లీ పసుపు రంగు జెర్సీ ధరించి ఐపీఎల్ 2027లో చెపాక్ పిచ్‌పై అడుగుపెట్టాలని కోట్లాది మంది ఎంఎస్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.