న్యూఢిల్లీ: ఐపీఎల్–19కు ముందు చెన్నై సూపర్కింగ్స్కు ఎదురుదెబ్బ తగిలింది. కాలిపిక్క కండరాల గాయంతో లెజెండరీ బ్యాటర్ ఎంఎస్ ధోనీ మెగా లీగ్ తొలి రెండు వారాల మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని సీఎస్కే ఫ్రాంచైజీ శనివారం వెల్లడించింది. ‘మహీ ప్రస్తుతం రిహాబిలిటేషన్లో ఉన్నాడు. వీలైనంత త్వరగా దీనినుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికైతే తొలి రెండు వారాలు అందుబాటులో ఉండటం లేదు’ అని ఫ్రాంచైజీ పేర్కొంది.
2020లో ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రతి ఐపీఎల్ సీజన్కు ముందు మహీ భవిష్యత్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా.. అతను మాత్రం మెగా లీగ్కు అందుబాటులో ఉంటున్నాడు. అయితే కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతుండటంతో ఏడాది పొడవునా మ్యాచ్ ఫిట్నెస్ కాపాడుకోవడం సవాల్గా మారింది.
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా కొనసాగుతున్నప్పటికీ.. సీఎస్కే ఫ్రాంచైజీకి అసలైన నాయకుడిగా ధోనీయే కనిపిస్తాడు. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన మహీ.. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్కు దిగి మెరుపులు మెరిపించాడు. రిటైర్మెంట్ తర్వాత మోకాలి సమస్య తలెత్తడంతో 2023లో సర్జరీ కూడా చేయించుకున్నాడు. సోమవారం జరిగే తొలి మ్యాచ్లో సీఎస్కే.. రాజస్తాన్ రాయల్స్తో తలపడుతుంది.
