
చెన్నై : ఎప్పుడెప్పుడా అని ధోనీ యాక్షన్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేసిన ధోనీ అతి త్వరలో ఐపీఎల్ 13వ ఎడిషన్ ప్రిపరేషన్స్ మొదలుపెట్టనున్నాడు. మార్చి 2 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పూర్తిస్థాయి ట్రైనింగ్లో పాల్గొన బోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీతో పాటు పలువురు ఆటగాళ్లు ఈ సెషన్ లో పాల్గొంటారు. సీఎస్కే మెయిన్ ప్లేయర్స్ సురేశ్ రైనా, అంబటి రాయుడు ఇప్పటికే చెన్నైలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు.‘చిదంబరం స్టేడియంలో మార్చి 2 నుంచి ధోనీ ట్రైనింగ్లో పాల్గోంటాడు.అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు. మార్చి 19కి జట్టు మొత్తం ఒక్క దగ్గరికి చేరుతుంది. ఆ రోజు నుంచి పూర్తిస్థాయి క్యాంప్ ప్రారంభిస్తాం ’ అని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ చెప్పారు. రెండేళ్లుగా సీఎస్కే ప్రాక్టీస్ సెషన్స్ కు చెన్నైలో అనూహ్య స్పందన వస్తుంది. ఈసారి కూడా పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ స్టేడియానికి వస్తారని జట్టు వర్గాలు భావిస్తున్నాయి . మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్కే తమ కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకొని గతేడాది డిసెంబర్ లో జరిగిన వేలంలో పీయూష్ చావ్లా, జోష్ హాజిల్ వుడ్ , సామ్కరన్ తోపాటు తమిళనాడు స్పిన్నర్ సాయి కిశోర్ ను దక్కించుకుంది.