‘ధురంధర్’ ఫ్రాంచైజీతో రెండు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న రణవీర్ సింగ్.. మరోవైపు వరుస వివాదాలతో వార్తల్లో నిలిచాడు. మంగళవారం మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ‘కాంతార’ వివాదానికి ఫుల్ స్టాప్ట్ పెట్టాడు. ఈలోపు ‘డాన్ 3’ వివాదం అతన్ని చుట్టుముట్టింది. సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రణవీర్పై మూడేళ్లు బ్యాన్ విధించింది.
దేశంలోనే అతిపెద్ద సినీ కార్మికుల సంఘం అయిన ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' (FWICE) తమ 4 లక్షల మంది సభ్యులలో ఎవరూ రణవీర్ సింగ్తో కలిసి పనిచేయరని ‘నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్’ జారీ చేసింది.
షూటింగ్కు మూడు వారాల ముందు ‘డాన్ 3’ నుండి రణ్వీర్సింగ్ తప్పుకోవడంతో తమకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లిందని నిర్మాత పర్హాన్ అక్తర్ ఫెడరేషన్కు ఫిర్యాదు చేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, విదేశీ ప్రయాణాలు, లొకేషన్ పర్మిషన్స్, హోటల్ బుకింగ్స్ లాంటి ముందస్తు ఏర్పాట్ల వల్ల నిర్మాతకు నష్టం జరిగిందని ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ వెల్లడించారు.
అంతేకాక రణవీర్ అర్థాంతరంగా తప్పుకోవడంతో చాలామంది టెక్నీషియన్స్, రోజువారీ వేతనంపై ఆధారపడే వందలాది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రణవీర్ను మూడుసార్లు వివరణ కోరినా నోటీసులను బేఖాతరు చేయడంతో బహిష్కరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ వివాదంపై రణవీర్ సింగ్ ప్రతినిధులు స్పందించారు.
పబ్లిక్గా ఈ విషయంపై స్పందించడం రణవీర్ సింగ్కు ఇష్టం లేదని, వృత్తిపరమైన విభేదాలను వ్యక్తిగతంలో పరిష్కరించుకోవాలని రణవీర్ భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక ఈ మూడేళ్లు రణవీర్ సింగ్ బాలీవుడ్ సినిమాలు చేయడా, మరి ఇప్పటికే కమిటైన సినిమాల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.
