తెలంగాణ పోలీస్ శాఖకు 50 బ్రీత్ అనలైజర్స్ అందజేత

తెలంగాణ పోలీస్ శాఖకు 50 బ్రీత్ అనలైజర్స్ అందజేత

రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను  డయాజియో కంపెనీ అందజేసింది. ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో  బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  డీజీపీ రవి గుప్తా, అడిషనల్ డీజీపీ రైల్వేస్ & రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ లు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో  డయాజియో కార్పొరేట్ ఎఫైర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ రవి వర్మ, ఇతర సిబ్బంది బ్రీత్ అనలైజర్ లను అందజేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో విభాగాలలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్ లను అందజేసేందుకు డయాజియో కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. సామాజిక బాధ్యతగా వారు తీసుకున్న చొరవతో పోలీస్ సిబ్బంది సామర్థ్యం మెరుగవుతుందని, తద్వారా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. 

ఈ పరికరాల ద్వారా కొంతమంది నైనా కాపాడగలిగితే ప్రయోజనం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని దానిని నివారించేందుకు పోలీస్ సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని ఈ రకమైన ఆధునిక పరికరాల వల్ల పోలీస్ సిబ్బంది పనితీరు సామర్థ్యం పెరుగుతుందని తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు.  ప్రయాణికులు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలే కాక ఇతరుల ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని అడిషనల్ డిజిపి రైల్వే లు &  రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్ అన్నారు. 

ALSO READ :- కార్లు దొంగలించి OLXలో అమ్ముతున్న ముఠా అరెస్ట్

డ్రంక్ అండ్ డ్రైవింగ్ అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారని , నిర్విరామంగా ట్రాఫిక్ పోలీసులు తదనుగుణంగా పనిచేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు. దాదాపు 25 ప్రాంతీయ రవాణా కార్యాలయాలతో సమన్వయం చేసుకొని ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ సేఫ్టీ ఎస్పీ గోనే సందీప్, ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు,  సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డిసిపి లు వేణుగోపాల్ రెడ్డి, శివకుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.