కరెంట్​పోతే డయాలసిస్​ బంద్!..డీజిల్ కు హాస్పిటల్​లో పైసల్లేవ్..

కరెంట్​పోతే డయాలసిస్​ బంద్!..డీజిల్ కు హాస్పిటల్​లో పైసల్లేవ్..
  • రెండేండ్లుగా మెయింటెనెన్స్​ ఫండ్స్​ రావట్లే 
  • పేరుకుపోయిన రూ.1.50కోట్ల బకాయిలు 
  • గాలివానతో ఆసుపత్రిలో 30 గంటలపాటు పవర్​ లేదు.. 
  • వైద్య సేవలకు ఆటంకం.. నీళ్లు రాక పేషెంట్ల అవస్థలు 
  • గత బీఆర్ఎస్​ సర్కార్​ పాపం.. ​రోగులకు శాపం
  • జిల్లా మంత్రులు పట్టించుకోవాలని స్థానికుల విజ్ఞప్తి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కరెంట్​పోతే భద్రాద్రికొత్తగూడెం జిల్లా జనరల్​ హాస్పిటల్​లో డయాలసిస్​ సేవలు బంద్​ చేయాల్సి వస్తోంది. రెండేండ్లుగా మెయింటెనెన్స్​ ఫండ్స్​ రాకపోవడంతో ఆసుపత్రిలో కనీసం డీజిల్​కు కూడా కొనలేకపోతున్నారు. మొన్నటి గాలివానకు ఆసుపత్రి అంతా ఆగమాగమైంది. పేషెంట్లు అవస్థలు పడ్డారు.

ఫండ్స్​ రాక.. సమస్య పరిష్కారం కాక.. 

హాస్పిటల్​ మెయింటెనెన్స్​ ఫండ్స్​ను  రెండేండ్లుగా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం సరిగా ఇవ్వలేదు. దీంతో బకాయిలు దాదాపు రూ. 1.50కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. 100 బెడ్స్​ ఉన్న గవర్నమెంట్​ హాస్పిటల్​ను మెడికల్​ కాలేజ్​కు అనుబంధంగా 230 బెడ్స్​తో జిల్లా జనరల్​ హాస్పిటల్​గా మార్చామంటూ బీఆర్​ఎస్​ పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. కానీ సౌలతులు కల్పించడం మర్చిపోయారు. దీంతో ఒక గాలివానకే ఆగమాగం కావాల్సి వస్తోంది.  ఫండ్స్​ లేక ఎమర్జెన్సీ మెడిసిన్స్​, ఇతర పరికరాలు కొనలేని దుస్థితి.

కనీసం కరెంట్​ పోతే జనరేటర్​కు డీజిల్​ తేవడం లేదు. ఎమర్జెన్సీకి ఏదో మినిమం డీజిల్​ను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం గాలివానలు వరుసగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మెయింటెనెన్స్​ సరిగా లేకపోతే ఎన్నో ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మందులకు మెడికల్​ షాప్​తో పాటు డీజిల్​కు బంక్​ల యాజమానులు మొఖం చాటేస్తున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు.

ఆఫీసర్ల తీరుపై అసహనం..

కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున విద్యుత్​ శాఖ ఆఫీస్, దాని దగ్గరలోనే గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​ ఉంది. ఆదివారం రాత్రి గాలి వానతో హాస్పిటల్​తో పాటు పలు ప్రాంతాల్లో కరెంట్​ స్తంభాలు విరిగిపోయాయి. ఎమర్జెన్సీ సర్వీస్​​ కింద హాస్పిటల్​లో కరెంట్​ను పునరుద్ధరించాల్సి ఉన్నప్పటికీ విద్యుత్​ శాఖ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోలేదు. సోమవారం రాత్రి ఎమ్మెల్యేతో పాటు మీడియా, రోగులు సీరియస్​ కావడంతో అప్పటికప్పుడు కొత్త కరెంట్​ పోల్స్​ వేసి విద్యుత్​ సప్లైని పునరుద్ధరించారు. అయితే విరిగిన స్తంభాల స్థానంలో కొత్త పోల్స్​ వేసేందుకు అవసరమైన మిషనరీలు కొత్తగూడెం

లక్ష్మీదేవిపల్లి మండలాల్లో దాదాపు 15 వరకు ఉన్నాయి. కానీ ఒక కాంట్రాక్టర్​తో మిలాఖత్​ అయిన విద్యుత్​ శాఖాధికారులు గొయ్యి తీసే పనిని ఆయనొక్కరికి అప్పగించడంతో కరెంట్​ పోల్స్​ ఏర్పాటులో డిలే జరిగినట్లు తెలుస్తోంది. పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నా ఆఫీసర్లు మాత్రం నిర్లక్ష్యం వీడకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లా ముగ్గురు మంత్రులు, కలెక్టర్​ స్పందించి ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. 

పేషెంట్లకు తప్పని తిప్పలు 

కొత్తగూడెంలో ఆదివారం రాత్రి గాలివానకు పట్టణంలోని కరెంట్​ పోల్స్​ విరిగాయి. దీంతో జిల్లా గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో దాదాపు 30 గంటల పాటు కరెంట్​ సప్లయ్​నిలిచిపోయింది. హాస్పిటల్​లోని డయాలసిస్​ పేషెంట్స్​ను డాక్టర్లు ఇండ్లకు పంపించారు. మధ్యలో ఏమైనా జరిగితే తమ ప్రాణం పోవాల్సిందేనా.. అంటూ డయాలసిస్​ పేషెంట్లు సోమవారం రాత్రి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.

ఆక్సీజన్​ సప్లై నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ కేసులు చూడలేని పరిస్థితి నెలకొంది. నీళ్లు లేక పేషెంట్లు, వారి వెంట వచ్చినవాళ్లు నానా అవస్థలు పడ్డారు. ఇతర సేవలు అందించడంలోనూ ఇబ్బంది తప్పలేదు. గంటలపాటు కరెంట్​ సప్లై నిలిచిపోయినా మెడికల్​ కాలేజ్​ ప్రిన్సిపాల్​ మాత్రం అందుబాటులోకి రాలేదు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చి పోయిన తర్వాత  ప్రిన్సిపాల్​ రావడంపై పలువురు మండిపడుతున్నారు.