
- ఎక్స్చేంజిల నుంచి పర్సనల్ వాలెట్లకు భారీగా వెళుతున్న డిజిటల్ టోకెన్లు
న్యూఢిల్లీ: బిట్కాయిన్లో మళ్లీ ర్యాలీ మొదలవ్వడంతో ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఈ ఏడాది 20 వేల డాలర్ల కిందకి వచ్చిన ఈ పాపులర్ కరెన్సీ, ఈ లెవెల్ నుంచి 80 శాతం పైగా పెరిగి ప్రస్తుతం 30 వేల డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్ల పర్సనల్ డిజిటల్ వాలెట్లకు, క్రిప్టో ఎక్స్చేంజిలకు మధ్య ఫ్లోస్ పెరుగుతున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఈ ఏడాది బిట్కాయిన్ వాల్యూ పెరగడంతో ఈ నెల 4 తో ముగిసిన వారంలో 368 మిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్లు ఇన్వెస్టర్ల పర్సనల్ వాలెట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయని వెల్లడించింది.
క్రిప్టో ఎక్స్చేంజిల నుంచి బిట్కాయిన్ల అవుట్ ఫ్లో జరగడంలో ఇది సెకెండ్ హయ్యెస్ట్ వీక్ అని స్ట్రాటజిస్ట్ ఆండ్రూ మోస్ ఓ నోట్లో పేర్కొన్నారు. ‘ఇన్వెస్టర్లు తమ క్రిప్టో టోకెన్లను ఎక్స్చేంజి వాలెట్ల నుంచి తమ పర్సనల్ వాలెట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఇన్వెస్టర్లు టోకెన్లను హోల్డ్ చేయాలనుకోవడం చూస్తుంటే క్రిప్టో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి తగ్గినట్టు కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.
డిజిటల్ అసెట్ ప్లాట్ఫామ్స్పై యూఎస్ రెగ్యులేటరీ సంస్థలు కఠినంగా వ్యవహరిస్తుండడం వలన ఇన్వెస్టర్లు తమ క్రిప్టో టోకెన్లను ఎక్స్చేంజిల నుంచి వాలెట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ప్రారంభించారని అన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తే బిట్కాయిన్ల విలువ మరింత పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కిందటేడాది జూన్ తర్వాత మొదటిసారిగా బిట్కాయిన్ వాల్యూ 30 వేల డాలర్ల మార్క్ను క్రాస్ చేసింది. కిందటేడాది డిసెంబర్ 31 తో పోల్చుకుంటే 80 శాతం పైగా లాభపడింది.