
గోదావరి జిల్లాలు అనగానే కొబ్బరి చెట్లు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉంటుందని సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ ఆ ప్రాంతంలోనూ నేరాలు జరుగుతాయి అనే ఆలోచనల నుంచి పుట్టిందే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని చెప్పాడు దర్శకుడు కృష్ణచైతన్య. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ‘మొదట ఈ చిత్రాన్ని శర్వానంద్ హీరోగా అనుకున్నాం. కానీ తను వరుస చిత్రాలతో బిజీగా ఉండడంతో, త్రివిక్రమ్ గారి సూచన మేరకు విశ్వక్కు కథ చెప్పాను.
తనకు కథ నచ్చడంతో ఈ చిత్రం మొదలైంది. విశ్వక్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే గోదావరి మాండలికాన్ని విశ్వక్ సరిగ్గా చెప్పగలడా అని సందేహం కలిగింది. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని సర్ప్రైజ్ చేశాడు. ఇది ఓ కల్పిత కథ. మహా భారతంలోని ‘నా అనేవాడే నీ మొదటి శత్రువు’ అనే మాట నాకు చాలా ఇష్టం. అదే సినిమా స్టోరీ లైన్. ఒక మంచి కథను, చక్కని ఎమోషన్ను బ్యాలెన్స్ చేస్తూ ఈ కథ చెప్పొచ్చు అని భావించాను. అందుకు సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. సినిమాలోని చివరి ఇరవై నిముషాల ఎమోషనల్ సీన్స్ హృదయాన్ని హత్తుకుంటాయి.
సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్లో చూశారు. కొందరు ఇది గ్యాంగ్స్టర్స్ మూవీ అనుకుంటున్నారు.. ఇది గ్యాంగ్స్ మూవీ మాత్రమే. ఇక నేను గతంలో చేయాలనుకున్న ‘పవర్ పేట’ సినిమా రెండు భాగాలుగా తీయాల్సి ఉంది. దానికి బడ్జెట్ కూడా ఎక్కువ అవసరం. అందువల్లే అది కుదరలేదు. దర్శకుడిగా నా స్థాయి పెరిగాక కచ్చితంగా ఆ సినిమా చేస్తా’ అని చెప్పాడు.