స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు !!

స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు !!

ఎప్పుడూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా కృష్ణంరాజు మృతిపై చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి  అత్యంత  గొప్ప చిత్రాలను అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! అంటూ ఆర్జీవీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహనబాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్ కి,మహేష్, కల్యాణ్ కి తాను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఈ దుస్థితి అందరికీ వచ్చేదేనని... ఒక మహోన్నత  కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత  వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదన్నారు. 

మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దామన్న రామ్ గోపాల్ వర్మ.... కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదామన్నారు. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోందని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ట్వీట్లతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను వారి అకౌంట్ పేర్లతో ట్యాగ్ చేశారు.