పఠాన్ సినిమా కోసం కంపోజ్ చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్ లో షారుఖ్ ఖాన్ ఎంతో అంకితభావంతో పనిచేశారని ఆ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపాడు. ఇలాంటి కండలు తిరిగిన బాడీ పొందాలంటే ఎంతో ప్యాషన్ ఉండాలని, అది షారుఖ్ లో కనిపించిందని ఆయన అన్నారు. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ``పఠాన్లో ఆకట్టుకునే ఫిజిక్ తో కనిపించేందుకు షారుఖ్ ఎంతో శ్రమించారు. ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను తొలిసారి షారుఖ్ని కలిసినప్పుడు జరిగిన సంభాషణ ఇంకా గుర్తుంది. బాడీ పరంగా ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడాలో అప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన ప్రతి పదాన్ని గుర్తుంచుకొని.. ఆచరణలో పెట్టారు. ఇవాళ దాని ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తోంది`` అని అన్నారు.
సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ గురించి, షారుఖ్ గురించి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ``సినిమా చూసే ప్రతి ఒక్కరిలోనూ ఓ ఉత్సాహం రావాలని.. తనను చూస్తున్నంతసేపు ఆ ఉరకలు వేసే తనం ఆడియన్స్ లో ప్రవహించాలని షారుఖ్ కోరుకున్నారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైన స్టంట్లు చేశారు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో, వాతావరణంలో ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ కి.. థియేటర్లలో మరో రేంజ్ అప్లాజ్ దక్కి తీరుతుంది. ఇంత కష్టమైన స్టంట్స్ కోసం ఆయన శారీరకంగా అంతే గొప్పగా సిద్ధమయ్యారు. మన దేశంలోనే అత్యంత భారీ యాక్షన్ సినిమాగా పఠాన్ రూపొందుతోంది. షారుఖ్ ను స్క్రీన్ మీద చూసిన ప్రతి ఒక్కరికీ ఆయన చేసిన కృషి అర్థమవుతుంది. మేం డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ని నిజం చేయడానికి ఆయన తీసుకున్న శ్రమకు ఫిదా అయిపోయాం. షారుఖ్లాగా ఇంకెవరూ ఉండరు. సినిమాల పట్ల ఆయనకు ఉండే అంకితభావం, ప్రేమను అర్థం చేసుకోవాలంటే పఠాన్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే`` అని అన్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె, జాన్ అబ్రహం నటించిన సినిమా 'పఠాన్'. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ అటు ఫ్యాన్స్ ని, ఇటు ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ నటిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ మూవీలో షారుఖ్ బాడీ చూసి జనాలు అబ్బురపడుతున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళ్, తెలుగులో ఈ మూవీ విడుదల కానుంది.