- జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్ల డించారు.
శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. నియోజవకర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. మొత్తం139 లొకేషన్లలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పోలింగ్ ప్రక్రియను డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షిస్తం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాం”అని తెలిపారు.
పోలింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని చెప్పారు. 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామన్నారు. 1,761 మంది లోకల్ పోలీసులు, 8 కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలు బందో బస్తులో ఉంటాయన్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్బీఐతో మీటింగ్ పెట్టామని, దీనిపై ఆర్బీఐ మానిటరింగ్ ఉంటుందన్నారు. ఈ నెల 11న సాయంత్రం 6 వరకు వైన్ షాప్స్ క్లోజ్ ఉంటాయన్నారు. ప్రతి 2 గంటలకోసారి పోలింగ్ పర్సంటేజ్ అనౌన్స్ చేస్తామని చెప్పారు.
రూ.3.60 కోట్లు సీజ్
కోడ్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటి వరకు రూ.3.60 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 27 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు కలిసి నగదుతోపాటు మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ప్రచా రం ముగిసిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా నిఘా కొనసాగుతుందని కర్ణన్ తెలిపారు.
