డైవర్షన్ పాలిటిక్స్

డైవర్షన్ పాలిటిక్స్
  • సర్కారు చేతిలో  కొత్త పాచిక
  • లోటస్ పాండ్ అడ్డాగా న్యూ గేమ్
  • షర్మిలను అరెస్టు చేసి ఇష్యూ డైవర్ట్
  • ప్రతిపక్షాల సభను బైపాస్ చేసే ప్లాన్

రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. విపక్షాలకు సంబంధించిన కీలక సభలు, సమావేశాల తరుణంలో సర్కారు మైండ్ గేమ్ ప్లే చేస్తున్నదనే చర్చకొనసాగుతోంది. ఏడాది క్రితం పురుడుపోసుకున్న వైఎస్సార్ టీపీ ఆందోళనలను సర్కారు బూతద్దంలో పెట్టి చూడడం.. అరెస్టులు చేయడం ఇందులో భాగమే అనే చర్చ సాగుతోంది. 

 

సోమవారం ఉదయం..లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.. ఇంట్లోంచి షర్మిల బయటికి రాగానే అరెస్టు చేశారు.. ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసుల తోపులాట.. సర్కారుకు వ్యతిరేకంగా అనుచరుల నినాదాలు..  గంటపాటు హైడ్రామా.. తర్వాత షర్మిల అరెస్ట్.. బంజారాహిల్స్ ఠాణాకు తరలింపు.. అదే సమయంలో కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించేందుకు వెళ్లిన బండి సంజయ్.. ప్రభుత్వ తీరుపై బండి సంజయ్.. మరో వైపు ఖమ్మంలో టీపీసీసీ చీప్ నిరుద్యోగ నిరసన దీక్ష ఈ వార్తలను హైజాక్ చేసే ప్రయత్నంలో భాగంగానే షర్మిలను అరెస్టు చేశారా..? ఆమె వెళ్లి సిట్ కు వినతిపత్రం ఇస్తే ఏం జరుగుతుంది..? ఇంత హడావుడిగా షర్మిలను ఎందుకు అరెస్టు చేసినట్టు..? అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విపక్షాల కార్యక్రమాలు ఉన్న రోజు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండటం యాదృచ్చికమా..? సర్కారు గేమ్ ప్లానా..? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నది. కొత్తగా ఏర్పాటైన వైఎస్సార్టీపీకి ఉన్న కార్యకర్తల బలం తక్కువే..! షర్మిల మాత్రమే దూకుడుగా వెళ్తుంటారు..! ఆమెను హౌస్ అరెస్టు చేయడం వల్ల లేని హడావుడిని పోలీసులు సృష్టించడం తప్ప ఏమీ ఉండదన్న వాదనా బలంగానే ఉన్నది. గతంలో విపక్షాలకు  సంబంధించిన కీలక సమావేశాలు, సభలు ఉన్నప్పుడు షర్మిల నిరసనలను సర్కారు పావుగా వాడుకున్నదనే చర్చకొనసాగుతోంది.  

మార్చి 31, 2023

ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ ఆఫీసుకు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె రాగానే భారీ బలగాలు చుట్టుమట్టి అరెస్టు చేసి లోటస్ పాండ్ లోని ఆమె నివాసానికి తరలించడంతోపాటు లుక్ అవుట్ నోటీసులు జారీచేయడం సంచలనం రేకెత్తించింది. ఆఫీసు ముట్టడికి యత్నిస్తే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం చర్చకు దారి తీసింది... సీన్ కట్ చేస్తే.. అదే రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలోని పలు పట్టణాల్లో బీజేపీ ఆఫీసులను వర్చువల్ గా ప్రారంభించారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా చేసిన కామెంట్లకు మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 

మార్చి 28, 2023

జనతా మార్చ్ పేరుతో  ఉస్మానియా ఆస్పత్రిలో రోగులను పరామర్శించేందుకు వెళ్లిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఆమె కింద పడిపోయారు. అదే రోజు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్ర కేటీఆర్ లీగల్ నోటీసులు జారీచేశారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయం కాస్తా షర్మిల వైపునకు డైవర్ట్ అయ్యిందనే చర్చ కొనసాగింది.  

నవంబర్ 29,2022

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆమె భార్యపై షర్మిల అంతకు ముందు రోజు ఆరోపణలు చేశారు. దీనిపై తన అనుచరులతో కలిసి షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరారు. సోమాజిగూడ వద్ద ఆమె  ప్రయాణిస్తున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. ఆమె స్వయంగా డ్రైవ్ చేయడంతో టోయింగ్ వాహనం సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన హైడ్రామాలో షర్మిల వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.. సీన్ కట్ చేస్తే... అదే రోజు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిర్మల్ జిల్లా భైంసా సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సభకు అనుమతిని నిరాకరించడంతో ఆయన హైకోర్టు పర్మిషన్ తోఏర్పాటు చేసిన సభకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. భైంసా సభ కాస్తా.. షర్మిల అరెస్టు వైపు డైవర్ట్ అయ్యిందనే వాదన ఇప్పటికీ ఉంది.