సిరుల పండుగ.. దీపావళి ఫెస్టివల్

సిరుల పండుగ.. దీపావళి ఫెస్టివల్

దీపావళి అంటే ప్రతి ఇంటా  దీపాలు వెలిగే రోజు.. ఈ పండుగ రోజున పెద్దలు కూడా పిల్లల్లా మారి సరదాగా గడిపే రోజు.  చీకటిని... వెలుగులు తరిమికొట్టి చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం దీపావళి పండుగ.  ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు.

అయితే దీపావళి పండుగను ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు.  దీపావళి పండుగ ప్రస్తావన రామాయణం నుంచి ఉన్నదని చెబుతారు.  రావణ సంహారం జరిగాక సీతా సమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు రాముడు. అయోధ్యకు రాముడి రాక ... రావణుడిపై విజయానికి గుర్తుగా అమావాస్య చీకట్లతో నిండిపోయిన అయోధ్యను దీపాలతో అలంకరించి సంబురాలు చేసుకున్నారు అయోధ్య వాసులు.

నరకాసుర వధతో...

వరాహస్వామి.. భూదేవికి పుట్టిన నరకాసురుడు తనని  కన్నతల్లి మాత్రమే చంపేలా బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని పొందుతాడు.  సత్యభామను భూదేవికి ప్రతిరూపంగా భావిస్తారు.  ఆ వరంవల్ల ద్వాపర యుగంలో ఎందరినో హింసిస్తున్న నరకాసురుడిని చంపడానికి కృష్ణావతారం ఎత్తుతాడు శ్రీ మహా విష్ణువు.  తరువాత సత్యభామను పెండ్లాడి.. ఆమెను నరకాసురునితో యుద్దం చేసి వధించేలా చేశాడు కృష్ణుడు.  ఆ రోజునే దీపావళిగా పిలుస్తారు.

అమావాస్య రోజు

దీపావళిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుతారు.  కోస్తాంధ్రలో సాయంత్రం కాగానే గోంగూర కర్రకు ఒత్తిని చుడతారు.  దాన్ని వెలిగించి గుమ్మాలకు, వాకిట్లో, ఇంటి చుట్టుపక్కల నేలపై కొడుతూ 
దివ్వి దివ్వి దీపావళి.. మళ్లీ వచ్చే నాగుల చవితి
పుట్ట మీద జొన్న కర్ర.. పుటుక్కు దెబ్బ
... అంటూ పాడతారు.
ఆ తరువాత ఆ కర్రను ఎవ్వరూ తొక్కని చోట వీధికి దూరంగా పడేసి.. వెనక్కు తిరిగి చూడకుండా వస్తారు.  తరువాత దీపాలు వెలిగించి... టపాసులు కాల్చి పండుగ చేసుకుంటారు.  రోగాలు కలుగజేసే రాక్షసుడు ఇంటికి రాకుండా తరిమి కొట్టడమే దీని వెనుక వెనుక ఉన్న పురాణ గాధ. . .

లక్ష్మీ దేవికి పూజలు...

దీపావళినాడు ఉత్తరాదిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు.  కొన్ని చోట్ల కేదారీశ్వర నోములు కూడా చేసుకుంటారు.  కేదారీశ్వరుడు అంటే శివుడు పండ్లు, పూలు, విత్తనాలతో దేవుడి మందిరాన్ని అలంకరించి కేదారీశ్వరుడిని.. లక్ష్మీదేవిని పూజిస్తారు.  దానివల్ల పంటలు బాగా పండి సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.  పూజ అనంతరం బంధువులకు, ముత్తైదువులకు మిఠాయిలు పంచి... విందు భోజనం పెడతారు.  తరువాత టపాసులు కాల్చి పండుగ చేసుకుంటారు.

ధన్వంతరి జయంతి

ఆయుర్వేద అధిపతి అయిన ధన్వంతరి జయంతి ఈ రోజే.  క్షీర సాగర మధనంలో నుంచి లక్ష్మీదేవి కామధేనువు , కల్పవృక్షం, ఐరావతంతో పాటు అమృతభాండం, మరొక చేతితో ఆయుర్వేద గ్రంధాలతో ఆవిర్భవించాడు ధన్వంతరి.  అందుకు దీపావళి రోజున ఆయనను కూడా పూజిస్తారు.  ధన్వంతరిని పూజిస్తే... లక్ష్మీ కటాక్షం ఉంటుందని భక్తులు విశ్వస్తుంటారు. 

ALSO READ :- ఏమరుపాటుగా ఓటు వేస్తే.. మన భవిష్యత్ ఆగమైతది: కేసీఆర్