ప్రజల విశ్వాసాన్నికేసీఆర్ కోల్పోయారు

ప్రజల విశ్వాసాన్నికేసీఆర్ కోల్పోయారు

హైదరాబాద్, నిజామాబాద్, వెలుగు: పీకే వ్యూహాల్లో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. దేశ సంపదను ధ్వంసం చేసేందుకు యువకులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. నిజామాబాద్‌‌లో ఉమ్మడి జిల్లా శక్తి కేంద్రాల ఇన్‌‌చార్జ్‌‌ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జులై 3న జరిగే మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పీకే  స్ట్రాటజీతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, విధ్వంసాలు అందులో భాగమేనని, రాజకీయ అస్థిరత ఏర్పడేలా కుట్ర పన్నారని ఆరోపించారు. అగ్నిపథ్‌‌పై యువతలో లేనిపోని అపోహలు సృష్టించారని మండిపడ్డారు. దేశ ప్రతిష్టను దిగజార్చేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని, ప్రజల విశ్వాసాన్ని ఆయన కోల్పోయారని అన్నారు. ఎన్ని సర్వేలు చేసినా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశంలేదనే జాతీయ పార్టీ పేరుతో డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, నేతలు ప్రేమేందర్ రెడ్డి, మీసాల చంద్రయ్య, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.