న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికలకు ముందు తానే గొప్ప హిందువునంటూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే హిందువులను అవహేళన చేయడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి సైతం పబ్లిసిటీ కోసం హిందూ దేవుళ్లపై నోరు పారేసుకోవడం సరికాదన్నారు.
హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నర నరాల్లోనూ హిందూ ద్వేషం నింపుకుంది. హిందువుల పట్ల, హిందూ సనాతన ధర్మం పట్ల విషం చిమ్ముతోంది. దేవుళ్లు, దేవాలయాలు తిండిపెడతాయా? కొలువులిస్తాయా? అంటూ గతంలో కాంగ్రెస్ నేత శ్యాంపిట్రోడా హిందూ ధర్మాన్ని హేళన చేశారు’ అని ఆమె అన్నారు.
