
సిద్దిపేట టౌన్, వెలుగు: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చడానికి వైద్య సిబ్బంది, ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగ్యస్వామ్యం కావాలని డీఎంహెచ్ వో పల్వన్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నాసర్ పురా అర్బన్ హెల్త్ సెంటర్ లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. టీబీ చికిత్స పొందిన వారికి, చికిత్సను మధ్యలో ఆపిన వారికి, క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు, పొగ, ఆల్కహాల్ తాగేవారు, తరచుగా అనారోగ్యానికి గురవుతున్నవారికి, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి వైద్యులు టీబీ లక్షణాలు ను గుర్తించి, డాట్ పద్ధతి ద్వారా పూర్తిగా చికిత్స ఉచితంగా అందించాలని సూచించారు. చికిత్స కాలంలో ప్రభుత్వం ఆరు నెలలు నెలకు వెయ్యి రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ లో పోషకాహారం కోసం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో ఆనంద్, ప్రోగ్రాం ఆఫీసర్ అరుణ్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటెన్సివ్ టీబీ క్యాంపెయిన్ కంది పీహెచ్సీలో ప్రారంభించారు. డీఎం హెచ్ వో గాయత్రీ దేవి మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, మద్యపానం, ధూమపానం చేసేవారు టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ అయితే ప్రభుత్వం మందులను ఉచితంగా అందిస్తుందన్నారు.
వైద్య సిబ్బంది జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో పర్యటిస్తారని అనుమానం ఉన్నవారు టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి అరుణ కుమారి, డాక్టర్ శశాంక్ దేశ్పాండే, డబ్ల్యూహెచ్ వో కన్సల్టెంట్ స్నేహశుక్ల, డాక్టర్ సాయి శంకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.