ఉప్పల్ మ్యాచ్ కు వెళ్లున్నారా? అయితే వీటిని తీసుకెళ్లొద్దు

ఉప్పల్ మ్యాచ్ కు వెళ్లున్నారా? అయితే వీటిని తీసుకెళ్లొద్దు

ఉప్పల్​స్టేడియంలో బుధవారం జరగనున్న సన్​రైజర్స్​హైదరాబాద్ వర్సెస్​ముంబై ఇండియన్స్​మ్యాచ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. 2,800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు వెల్లడించారు. మంగళవారం స్టేడియంలోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

ముంబై, హైదరాబాద్​మ్యాచ్ కు 39 వేల మంది ఫ్యాన్స్ రానున్నారని తెలిపారు. స్టేడియం పరిసరాల్లో 300 మంది ట్రాఫిక్​ పోలీసులు, 918 మంది సివిల్​ పోలీసులు, 12 ప్లాటూన్ల స్పెషల్​ ఫోర్స్ పోలీసులు, రెండు ఆక్టోపస్​ టీమ్స్,10 మౌంటెడ్​పోలీస్, 10 వజ్రా వాహనాలు, ఎస్ బీ , సీసీఎస్​, ఎస్ఓటీ తదితర పోలీస్​బలగాలు విధుల్లో ఉండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. 

ఇవి తీసుకురావద్దు

ల్యాప్​టాప్​లు, వాటర్​బాటిళ్లు, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్​గ్యాడ్జెట్లు, మ్యాచ్​బాక్సులు, సిగరెట్లు, లైటర్లు, పదునైనా కత్తులు, బ్లేడ్లు, ప్లాస్టిక్​ వస్తువులు, బైనాక్యూలర్లు, రైటింగ్​పెన్స్, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్​ఫ్యూమ్​బాటిల్స్, బ్యాగులు, ఫుడ్​ఐటమ్స్ స్టేడియంలోకి తీసుకురావొద్దని సీపీ సూచించారు. స్టేడియం వద్ద బ్లాక్​లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మ్యాచ్​సందర్భంగా మెట్రో, ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులను నడుపుతున్నారని, వినియోగించుకోవాలని సూచించారు.