హెల్త్ సెంటర్లు అప్గ్రేడ్ చెయ్యం
ఉన్నవి బలోపేతం చేశాక కొత్తవాటి సంగతి ఆలోచిస్తం
హైదరాబాద్, వెలుగు: ‘‘ప్రైమరీ హెల్త్ సెంటర్లను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నరు. ఇప్పటికిప్పుడు అప్గ్రేడ్ చెయ్యం.. అప్గ్రేడ్ చేసిన హెల్త్ సెంటర్లు, హాస్పిటళ్లను బలోపేతం చేయాలి. వాటిలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించి, సౌకర్యాలు కల్పించిన తర్వాతే కొత్తవాటి సంగతి ఆలోచిస్తం’’ అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయా హాస్పిటళ్లలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనేక హాస్పిటళ్లలో సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేని మాట నిజమేనని, వాటిని భర్తీ చేయడానికి సీఎం ఇప్పటికే ఆమోదం తెలిపారని చెప్పారు. సమావేశాలు ముగియగానే నియామక ప్రక్రియ చేపడుతామన్నారు.
60 % సీడ్ మన రాష్ట్రం నుంచే: నిరంజన్
దేశానికి అవసరమైన విత్తనాల్లో 60 శాతం రాష్ట్రం నుంచే ఇస్తున్నామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. యేటా 7 లక్షల టన్నుల వరి విత్తనాలు సరఫరా చేస్తున్నామని అసెంబ్లీలో ఆయన చెప్పారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతుకు ఆదాయం గ్యారంటీ అని అన్నారు.
ట్రాక్టర్ల భారం పంచాయతీలపై పడదు: ఎర్రబెల్లి
గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్ల నిర్వహణ భారం పంచాయతీలపై పడదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. చిన్న పంచాయతీలకు యేటా రూ. 8 లక్షలు ఇస్తున్నామని, ఈజీఎస్ కింద చేపట్టే నర్సరీ పనులకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తే అదనపు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు ఈజీఎస్ ద్వారా సమకూరే ఆదాయంతో ట్రాక్టర్ల మెయింటెనెన్స్కు, డ్రైవర్కు జీతం ఇవ్వొచ్చని అసెంబ్లీలో పేర్కొన్నారు.
For More News..