సూర్యాపేట, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యంతో యువకుడు చనిపోయాడని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన సాయిని శ్రీకాంత్(23) గ్రామంలోనే ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేస్తున్నాడు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి జిల్లా కేంద్రంలోని రోహిణి ఆసుపత్రికి వచ్చాడు.
డాక్టర్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వస్తాడని చెప్పిన సిబ్బంది సెలైన్ బాటిల్ పెట్టి ఇంక్షన్ చేశారు. కొద్ది సేపటికే శ్రీకాంత్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే అంబులెన్స్ పిలిపించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే లోపే యువకుడు చనిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే శ్రీకాంత్ చనిపోయాడని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
