కేంద్ర పథకాల పేర్లు మార్చొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలను హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాలు నిబంధనలు, షరతులను ఉల్లంఘించి హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ స్కీం పేరుతో అమలు చేయకుండా తమ సొంత స్టిక్కర్లు వేసుకుంటున్నాయి. అలా చేస్తే ఆ పథకాన్ని నిలిపివేసినట్లు కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని మాండవీయ హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు లేఖ రాశామని చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతోన్న ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి పథకాల అమలుపై శుక్రవారం లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు మాండీవీయ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ ఆయుష్మాన్ భారత్ లో భాగంగా కేంద్రం ప్రారంభించిన హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ పథకం చాలా రాష్ట్రాల్లో అమలవుతోంది. ఈ పథకం కేంద్ర, రాష్ట్రాల 60:40 కంట్రిబ్యూషన్ తో నడుస్తుంది. అయితే కేంద్ర పథకాలకు కొన్ని రాష్ట్రాలు పేర్లు మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. నిభంధనలు పాటించకుండా, స్కీంతో ఏకీభవించకుండా పథకాలు అమలు చేస్తే తాము గ్రాంట్ లను నిలిపివేస్తాం. కేంద్రం ప్రవేశ పెట్టిన స్కీంలకు మొహల్లా క్లినిక్ అని పెట్టారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఈ అంశంపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాం’. అని ఢిల్లీ పంజాబ్ ,ఢిల్లీ ప్రభుత్వాల పేర్లు చెప్పకుండా మంత్రి మాండవీయ హెచ్చరించారు.