- యుద్ధం ఆగిపోవాలంటే ప్రధాని మోడీ పాత్ర కీలకం: దిమిత్రీ కులేబా
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇండియా తక్కువ ధరకు ఆయిల్ కొనడంపై ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాము ఉన్న పరిస్థితిని సొమ్ము చేసుకోవద్దని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా ఇండియాకు విజ్ఞప్తి చేశారు. ఇండియా చేస్తున్నది కరెక్ట్ కాదని ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. రష్యా దురాక్రమణతో తాము రోజూ ఇబ్బందులకు గురవుతున్నామని, ఆ దేశం చేస్తున్న దాడుల వల్ల ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారని చెప్పారు. ఈ టైంలో తమ శత్రు దేశం నుంచి భారత్ తక్కువ రేటుకు ఆయిల్ కొంటూ తమ పరిస్థితిని సొమ్ము చేసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర కీలకమని, తన గొంతుతో మోడీ ప్రభావం చూపగలరని కులేబా ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు, స్వదేశానికి వెళ్లిపోయిన ఇండియన్ స్టూడెంట్లు తిరిగి రావాలని దిమిత్రీ కులేబా విజ్ఞప్తి చేశారు.