స్పందనలో అధికారులతో రివ్యూ
విజయవాడ: కోవిడ్పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. స్పందనలో భాగంగా వివిధ జిల్లాల కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎక్కడా ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలన్నారు. పిహెచ్సిలు, యుహెచ్పిలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులు, జిజిహెచ్లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి చేయాలన్నారు. కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్ధంకాని పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ రాకూడదని జగన్ స్పష్టం చేశారు.
కోవిడ్ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆసుత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్ను ఉపయోగించుకోవాలి, ఈ నంబర్ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.. ఈ కాల్ సెంటర్నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్లు వస్తే వెంటనే దానిపై స్పందించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ ఫోన్ కాల్స్పై ఎలా రెస్పాండ్ అవుతున్నామనేదే మన పనితీరుకు అద్దం పడుతుంది.. కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లు, జెసిలు ప్రతిరోజూ 104 కాల్ సెంటర్లకు, జిల్లా కోవిడ్ సెంటర్లకు మాక్ కాల్స్ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత వుందా లేదా అనేదానిని పరీక్షించాలన్నారు. ఆర్టిపిసిఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు.
జిల్లాల్లోని అన్ని ల్యాబ్లకు అవసరమైన పరికరాలను అందించడం జరిగింది. ఎక్కడా కిట్ లు లేవనే పేరుతో పరీక్షలు నిరాకరించకూడదు.. పాజిటీవ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లు వున్న వారిని ఖచ్చితంగా హోం క్వారంటైన్లో వుంచేలా చర్యలు తీసుకోవాలి.. కోవిడ్ నేపథ్యంలో అదనంగా 17వేల మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆరు నెలల కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించేందుకు అనుమతి ఇచ్చాం… మరో 11 వేల మంది ట్రైనీ నర్స్లను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.. దీనికి సంబంధించి ఇంకా కొన్నిచోట్ల నియామకాలు పూర్తి కాలేదు, వాటిని వెంటనే పూర్తి చేయాలి.. మరో వారం రోజుల్లో రెగ్యులర్ పోస్ట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి.. నియామకం పొందిన అభ్యర్ధులు వెంటనే వారికి నిర్ధేశించిన కోవిడ్ విధుల్లో చేరాలి… దానిని కూడా కలెక్టర్లు, జెసిలు పర్యవేక్షించాలని సీఎం జగన్ చెప్పారు. హోం ఐసోలేషన్లో వున్న వారికి అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లను పంపిణీ చేశాం.. మెడికల్ ఆఫీసర్ ఫోన్లో 14 రోజుల పాటు పేషంట్కు అందుబాటులో వుండాలి.. జాయింట్ కలెక్టర్లు ఈ హోం కిట్లలో అన్ని మందులు వున్నాయో లేదో పర్యవేక్షించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.